కమీషన్ల కోసమే మోడీ సర్కార్ ఎన్నికల బాండ్లు: రాహుల్ గాంధీ

by Dishanational1 |
కమీషన్ల కోసమే మోడీ సర్కార్ ఎన్నికల బాండ్లు: రాహుల్ గాంధీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధమని భారత అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. దీనిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు పలువురు నేతలు స్పందించారు. కేంద్రం, ఈసీ తీరుపై విమర్శలు చేశారు. ఈ పరిణామంపై ఎక్స్‌లో స్పందించిన రాహుల్ గాంధీ, 'ఎన్నికల బాండ్లను మోడీ సర్కారు లంచం, కమీషన్లు తీసుకునే సాధనంగా మార్చుకుంది. ఇది నరేంద్ర మోడీ అవినీతి రాజకీయాలకు మరో రుజువు అని, అది నేడు సుప్రీంకోర్టులో ఋజువైందని' ట్వీట్ చేశారు. ఇక, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ సైతం, 'మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్నికల బాండ్లు పార్లమెంట్ ఆమోదించిన రెండు చట్టాలను, రాజ్యాంగాన్ని ఉల్లంఘించిందని సుప్రీంకోర్టు తీర్పు తేల్చి చెప్పింది. నోట్ల కంటే ఓట్లకు ఎక్కువ శక్తి ఉందన్న వాస్తవాన్ని ఈ తీర్పు స్పష్టం చేసింది. దీన్ని తాము స్వాగతిస్తున్నామని' ట్వీట్ చేశారు.

'మోడీ ప్రభుత్వం భవిష్యత్తుల్లో ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలకు పాల్పడటం మానేసి, అత్యున్నత న్యాయస్థానం మాట వింటుందని ఆశిస్తున్నాం. దీనివల్ల ప్రజాస్వామ్యం, పారదర్శకత కొనసాగుతుందని భావిస్తున్నట్టు ' కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. మోడీ ప్రభుత్వ నల్లధన మార్పిడి పథకాన్ని రద్దు చేసిన సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు ఎక్స్‌లో పేర్కొన్నారు. పార్టీకి చందాలిస్తున్న వారికి ప్రత్యేకమైన అధికారాలు కల్పించే మోడీ ప్రభుత్వం, రైతులకు మాత్రం పదే పదే అన్యాయం చేస్తోందని కాంగ్రెస్ నేతలు విమర్శలు గుప్పించారు. కాగా, ఎన్నికల బాండ్ల జారీని నిలిపివేయాలని సుప్రీంకోర్టు గురువారం చారిత్రాత్మక తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. కేంద్రం తెచ్చిన ఎన్నికల బాండ్ల పథకానికి చ‌ట్ట‌బ‌ద్ధ‌త ఉంటుందా లేదా అన్న పిటీష‌న్ల‌పై సీజేఐ డీవై చంద్ర‌చూడ్ నేతృత్వంలోని అయిదుగురు స‌భ్యుల ధ‌ర్మాస‌నం ఈ తీర్పు వెల్లడించింది. ఈ బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్దమని, పౌరుల ప్రాథమిక హక్కును ఉల్లంఘిస్తోందని అభిప్రాయపడింది.

Next Story

Most Viewed