Army: మేం తలుచుకుంటే కలుగులో దాక్కోవాల్సిందే- ఆర్మీ

by Shamantha N |

‘ఆపరేషన్‌ సిందూర్‌’ తర్వాత భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయి. దాయాది అయితే, ఈ పరిణామాల వేళ ఆర్మీ(Indian Army) ఎయిర్‌ డిఫెన్స్‌ డీజీ లెఫ్టినెంట్‌ జనరల్‌ సుమేర్‌ ఇవాన్‌ డి కున్హా సంచలన వ్యాఖ్యలు చేశారు.

Army: మేం తలుచుకుంటే కలుగులో దాక్కోవాల్సిందే- ఆర్మీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ‘ఆపరేషన్‌ సిందూర్‌’ తర్వాత భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయి. దాయాది అయితే, ఈ పరిణామాల వేళ ఆర్మీ(Indian Army) ఎయిర్‌ డిఫెన్స్‌ డీజీ లెఫ్టినెంట్‌ జనరల్‌ సుమేర్‌ ఇవాన్‌ డి కున్హా సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌ తలుచుకుంటే పాక్‌ మొత్తంపై దాడి చేసే సామర్థ్యం మనకు ఉందన్నారు. అదే జరిగితే దాయాది (Pakistan) ఏదైనా కలుగు వెతుక్కుని అందులో దాక్కోవాల్సిందేనని అన్నారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఇస్లామాబాద్ పై విమర్శలు గుప్పించారు . ‘‘పాకిస్థాన్‌పై పూర్తి స్థాయిలో దాడి చేసేందుకు భారత్‌ వద్ద సరిపడా ఆయుధాలు ఉన్నాయి. పాక్ లోని ప్రతి ప్రదేశం మన రేంజ్‌లోనే ఉంది. మన సరిహద్దుల నుంచే ఆ దేశంలోని అన్ని ప్రాంతాలపై దాడి చేయగలం. ఒకవేళ వాళ్లు తమ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌ను రావల్పిండి నుంచి ఖైబర్‌ పఖ్తుంఖ్వా లాంటి ప్రాంతాలకు తరలించినా.. అక్కడ కూడా దాడులు చేసేవాళ్లమే. అప్పుడు వారు ఏదైనా కలుగు వెతుక్కుని అందులో దాక్కోవాల్సి వచ్చేది’’ అని సుమేర్‌ విమర్శించారు.

అధునాతన స్వదేశీ సాంకేతికత

అంతేకాకుండా, ఆపరేషన్ సిందూర్‌లో అధునాతన స్వదేశీ సాంకేతికత, దీర్ఘ శ్రేణి డ్రోన్లు, గైడెడ్‌ మిస్సైళ్లు కీలక పాత్ర పోషించినట్లు కున్హా తెలిపారు. దేశ సార్వభౌమత్వాన్ని, ప్రజలను రక్షించడం సాయుధ దళాల ప్రాథమిక విధి అని నొక్కిచెప్పారు. ‘‘మన సార్వభౌమత్వాన్ని రక్షించడమే సైన్యం కర్తవ్యం. సరిహద్దుల్లో చొరబాట్లను అడ్డుకోవడంతో పాటు ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా చూడటమే మా ప్రథమ ప్రాధాన్యం. దానికి అనుగుణంగానే మేం ఆపరేషన్‌ చేపట్టాం. ఈ రోజు మనం సాధించిన విజయంతో కేవలం సైనికులే కాదు.. వారి కుటుంబాలు, యావత్ భారతావని గర్వపడుతోంది’’ అని కున్హా హర్షం వ్యక్తం చేశారు. కాగా, ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్‌లోని పహెల్గాంలో ఉగ్రదాడి జరిగింది. టూరిస్టులపై ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. పహెల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ‘ఆపరేషన్‌ సిందూర్‌’ చేపట్టింది.

Next Story