ఢిల్లీ తొక్కిసలాటలో ఏడేళ్ల కుమార్తె మృతి.. కన్నీళ్లు తెప్పిస్తున్న తండ్రి మాటలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-02-16 14:13:52  IST  )

ఢిల్లీ తొక్కిసలాటలో ఏడేళ్ల కుమార్తె మృతి చెందడంపై తండ్రి చెప్పిన మాటలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి..

ఢిల్లీ తొక్కిసలాటలో ఏడేళ్ల కుమార్తె మృతి.. కన్నీళ్లు తెప్పిస్తున్న తండ్రి మాటలు
X

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ రైల్వే స్టేషన్‌(Delhi Railway Station)లో శనివారం రాత్రి తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో 11 మంది మహిళలు, ఐదుగురు చిన్నారులు సహా 18 మంది మృతి చెందారు. ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh) ఉన్నావ్‌కు చెందిన ఓపిల్‌సింగ్‌(Opilsingh) ఏడేళ్ల కుమార్తె రియా(Riya) సైతం చనిపోయారు. అయితే తొక్కిసలాటపై ఆయన చెప్పిన విషయాలు వింటే కన్నీళ్లు ఆగవు. తలలో మేకు గుచ్చుకోవడం వల్ల రియా చనిపోయిందని ఆయన తెలిపారు.

ఓపిల్ సింగ్ చెప్పిన మాటలు..


‘‘నేను ఢిల్లీలో కూలీగా పని చేస్తున్నాను. నా ఫ్యామిలీతో కలిసి ఉత్తరప్రదేశ్ వెళ్లేందుకు రైల్వే స్టేషన్‌కు వెళ్లాం. రిజర్వేషన్ టికెట్ కూడా కన్ఫర్మ్ అయింది. అయితే రైల్వే స్టేషన్‌లో జనాలు విపరీతంగా ఉండడంతో ఇంటికి తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నాం. అప్పటికే ప్లాట్‌ఫారమ్ నంబర్ 14 వైపు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంది. దీంతో బయటకు వెళ్లేందుకు బ్రిడ్జి‌పై నుంచి దిగే ప్రయత్నం చేశాం. మరో 6 మెట్లు దిగితే కిందకు వెళ్లిపోయేవాళ్లం. అంతలోనే ఒక్కసారిగాపై నుంచి 5 నుంచి 6 వేల మంది జనం వచ్చారు. ఒకరిపై ఒకరు పడిపోయారు. దీంతో మేమంతా రద్దీలో చిక్కుకుపోయాం.’’ అని చెప్పారు.

అయితే ఆ సమయంలో తన కుమార్తె చేయి తన చేతి నుండి జారిపోయిందని ఓపిల్ సింగ్ తెలిపారు. కానీ మెట్ల పక్కన ఉన్న ఖాళీ ప్లేస్‌లోకి రియా వెళ్లిందని చెప్పారు. ‘‘అయితే అక్కడ కూడా విపరీతమైన రద్దీ పెరిగింది. ఇంతలో ఒక ఇనుప మేకు రియా తలలో గుచ్చుకుంది. దీంతో రక్తం గడ్డకట్టి మేకు గుచ్చుకున్న చోట పూర్తిగా నల్లగా మారిపోయింది. తన కూతురు దగ్గరకు వెళ్లే సరికి సమయం పట్టింది. వెంటనే అంబులెన్సులు దొరకలేదు. పర్సు కూడా తొక్కిసలాటలో పోయింది. ఇద్దరు కూలీలు ఒక్కొక్కరు రూ.100 చొప్పున మాకు సాయం చేశారు. అనంతరం కూతురిని ఆటోలో ఎక్కించుకుని కళావతి ఆస్పత్రికి తీసుకెళ్లాం. అయితే కొంచెం ముందు వచ్చి ఉంటే బాగుండేదని డాక్టర్ చెప్పారు.’’ అంటూ తన మొబైల్‌లో కూతురి రియా ఫొటో చూపిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు.

Next Story