బతికుండగానే భర్తను పాతిపెట్టాలనుకున్న భార్య.. కానీ అతడి ఎంట్రీతో..!

by Yella Dhawani Reddy |   (  Updated:2025-08-02 09:18:14  IST  )

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది.

బతికుండగానే భర్తను పాతిపెట్టాలనుకున్న భార్య.. కానీ అతడి ఎంట్రీతో..!
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో భర్తలపై భార్యలు.. భార్యలపై భర్తల అఘాయిత్యాలు ఎక్కువయ్యాయి. చిన్న చిన్న మనస్పర్థలకే దారుణమైన నిర్ణయాలకు పాల్పడుతున్నారు. ఒకరినొకరు అడ్డుతొలగించుకోవాలనుకునే వరకు వెళ్తున్నారు. ఇలాంటి వార్తలు మనం నిత్యం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. తాజాగా ఇలాంటి దారుణమైన మరో ఘటనే యూపీలో (Uttarpradesh) వెలుగుచూసింది.

బరేలీ (Bareli) జిల్లాలోని ఇజ్జత్ నగర్‌ ప్రాంతానికి చెందిన రాజీవ్ అనే వ్యక్తి సాధన అనే మహిళ 2009లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. అయితే, కుటుంబకలహాల నేపథ్యంలో సాధన తన భర్త రాజీవ్‌ను చంపేయాలనుకుంది. ఇందుకోసం ఆమె తన ఐదుగురి సోదరులతో కలిసి పథకం రచించింది. ఈ క్రమంలో రాజీవ్‌ను బలవంతంగా తన ఇంటి నుంచి తీసుకెళ్లి, అతడిపై కర్రలతో విచక్షణరహితంగా దాడికి పాల్పడ్డారు. దాడిలో అతడి చేతులు, కాళ్లు విరగడంతో పాటు అతన్ని చనిపోయినట్టుగా భావించి సమీప అడవిలో పూడ్చిపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి ఈ దృశ్యాన్ని గమనించటంతో వెంటనే నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. వెంటనే అతడు రాజీవ్‌ను ఆస్పత్రికి తరలించి, చికిత్స అందించాడు. ప్రస్తుతం పరిస్థితి స్థిరంగా ఉన్నట్టు సమాచారం. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఈ ఘటన జులై 21న చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Next Story