మావోయిస్టుల కంచుకోటలో తొలిసారి రెపరెపలాడిన త్రివర్ణ పతాకం!

by Ramesh Naini |

దశాబ్దాలుగా మావోయిస్టుల ఆధిపత్యంలో ఉండి, కనీసం అడుగుపెట్టడానికే సాహసించని ప్రాంతంలో నేడు భారత త్రివర్ణ పతాకం సగర్వంగా ఆవిష్కృతమైంది.

మావోయిస్టుల కంచుకోటలో తొలిసారి రెపరెపలాడిన త్రివర్ణ పతాకం!
X

దిశ, డైనమిక్ బ్యూరో : దశాబ్దాలుగా మావోయిస్టుల ఆధిపత్యంలో ఉండి, కనీసం అడుగుపెట్టడానికే సాహసించని ప్రాంతంలో నేడు భారత త్రివర్ణ పతాకం సగర్వంగా ఆవిష్కృతమైంది. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా, కర్రిగుట్టల పరిసర ప్రాంతాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలను భద్రతా బలగాలు అత్యంత వైభవంగా నిర్వహించాయి. ఈ మారుమూల అటవీ ప్రాంతంలో జాతీయ జెండా ఎగరడం ఇదే తొలిసారి కావడం విశేషం.

తడపాల క్యాంపు వద్ద ఘనంగా వేడుకలు

కర్రిగుట్ట సమీపంలోని తడపాల పోలీస్ క్యాంపు వద్ద CRPF 196, COBRA 204 బెటాలియన్ల ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. జవాన్లు భారత్ మాతా కీ జై నినాదాల మధ్య జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఒకప్పుడు మావోయిస్టులు ఉన్నట్లు చెప్పుకునే ఆ ప్రాంతంలో, నేడు మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది.

'ఆపరేషన్ కగార్'తో మారిన ముఖచిత్రం

గత కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వం మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా 'ఆపరేషన్ కగార్'ను అత్యంత పకడ్బందీగా అమలు చేస్తోంది. ఈ ఆపరేషన్‌లో భాగంగా భద్రతా బలగాలు అటవీ ప్రాంతాల్లోకి చొచ్చుకువెళ్లి తమ స్థావరాలను (క్యాంపులను) ఏర్పాటు చేసుకుంటున్నాయి. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని ఈ కర్రెగుట్ట ప్రాంతం సుదీర్ఘ కాలం పాటు మావోయిస్టులకు సురక్షిత ప్రాంతంగా ఉండేది. ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో జరిగిన భారీ ఎన్‌కౌంటర్లలో అత్యధిక సంఖ్యలో మావోయిస్టులు మరణించడంతో వారి ప్రభావం గణనీయంగా తగ్గింది. భద్రతా బలగాలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ కర్రెగుట్టను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. అక్కడ శాశ్వత పోలీస్ క్యాంపుల ఏర్పాటుతో మావోయిస్టుల కదలికలకు అడ్డుకట్ట పడింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ తొలిసారి అధికారికంగా గణతంత్ర వేడుకలు నిర్వహించారు.

Next Story