వీధి కుక్కల తరలింపు వ్యవహారం.. సుప్రీం ధర్మాసనం కీలక తీర్పు

by Kema Shiva Kumar |   (  Updated:2025-08-22 05:51:30  IST  )

వీధి కుక్కల తరలింపుపై సుప్రీం కోర్టు మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది.

వీధి కుక్కల తరలింపు వ్యవహారం.. సుప్రీం ధర్మాసనం కీలక తీర్పు
X

దిశ, వెబ్‌డెస్క్: వీధి కుక్కల తరలింపు వ్యవహారంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు మరోసారి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 11న ఇచ్చిన ఆదేశాలను సవరిస్తూ.. అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. ఇప్పటి వరకు పట్టుకున్న శునకాలను మరోచోట వదిలి వేయాలని ఆదేశించింది. అదేవిధంగా రేబిస్, రెచ్చిపోయే కుక్కలను ప్రత్యేక షెల్టర్ జోన్‌‌లలో ఉంచాలని తెలిపింది. ఈ క్రమంలో అన్నిరాష్ట్రాల సీఎస్‌లకూ నోటీసులు జారీ చేసింది. వీధి కుక్కలకు వ్యాక్సినేషన్‌, స్టెరిలైజేషన్‌ చేసి వదిలేయాలని, బహిరంగ ప్రదేశాల్లో వాటికి ఆహారం పెట్టొదని సుప్రీం ధర్మాసనం తీర్పును వెలువరిచింది.

కాగా, దేశ రాజాధాని ఢిల్లీ పరిధిలోని NCR రీజియన్‌ నుంచి వీధి కుక్కలను తరలించాలంటూ ఈనెల 11న సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం ఆదేశాలిచ్చిన సంగతి తెలిసిందే. ప్రత్యేక షెల్టర్లకు తరలించి వాటి బాగోగులు చూడాలని, అవి మళ్లీ జనావాసాల్లో కనిపిస్తే సంబంధిత అధికారులపై కఠినచర్యలు ఉంటాయని హెచ్చరించిది. రేబిస్‌తో చిన్నారులు, వృద్ధుల ప్రాణాలు పోతున్నాయని కోర్టు వ్యాఖ్యానించింది. వీధి కుక్కల తరలింపును అడ్డుకునే ప్రయత్నాలు చేస్తే అది ధర్మాసనాన్ని ధిక్కరించినట్లేనని వార్నింగ్ ఇచ్చింది. ఈ క్రమంలోనే సుప్రీం తీర్పుపై అభ్యంతరాల వ్యక్తమైన నేపథ్యంలో ఆ తీర్పును పున: సమీక్షిస్తామని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ తెలిపారు. వీధి కుక్కల తరలింపుపై ఆదేశాలను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనం ఆగస్టు 14న విచారణ ప్రారంభించగా.. నేడు తీర్పును సవరిస్తూ కోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

Next Story