పోర్షే కారు బ్యానెట్‌పై సిమెంట్ కలిపి గుంతలు పూడ్చిన వ్యాపారి: వైరల్ వీడియో వెనుక అసలు కథ!

by Ramesh Naini |

విలాసవంతమైన కారుపై సిమెంట్ కలపడంతో ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అధికారుల నిర్లక్ష్యంపై మండిపడి అతడు ఇలా చేశాడని నెటిజన్లు భావించినా.. దీని వెనుక అసలు కారణం వేరే ఉంది.

పోర్షే కారు బ్యానెట్‌పై సిమెంట్ కలిపి గుంతలు పూడ్చిన వ్యాపారి: వైరల్ వీడియో వెనుక అసలు కథ!
X

దిశ, డైనమిక్ బ్యూరో: బెంగుళూరులో అధ్వాన్నంగా ఉన్న రోడ్లపై విసుగు చెందిన అఖిల్ హేమాద్రి అనే వ్యాపారి, గుంతలు పూడ్చేందుకు ఏకంగా తన రెండు కోట్ల రూపాయల పోర్షే కారు (Porsche) బ్యానెట్‌పైనే సిమెంట్, ఇసుక కలిపాడు. విలాసవంతమైన కారుపై సిమెంట్ కలపడంతో ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అధికారుల నిర్లక్ష్యంపై మండిపడి అతడు ఇలా చేశాడని నెటిజన్లు భావించినా.. దీని వెనుక అసలు కారణం వేరే ఉంది.

ఇదొక పీఆర్ స్టంట్..

కారుకు వేసిన ‘పెయింట్ ప్రొటెక్షన్ ఫిల్మ్’ (PPF) నాణ్యతను, తన కంపెనీ బ్రాండ్‌ను ప్రమోట్ చేసుకోవడానికే ఉద్దేశపూర్వకంగా ఈ ‘పీఆర్ స్టంట్’ చేసినట్లు సదరు వ్యాపారి స్పష్టం చేశాడు. గుంత పూడ్చడం పూర్తయ్యాక బ్యానెట్‌పై ఉన్న ఆ ప్రొటెక్టివ్ షీట్ తొలగించగా కారు చెక్కుచెదరకుండా సురక్షితంగా ఉంది. ‘అన్నింటికీ ప్రభుత్వంపైనే ఆధారపడకుండా, పౌరులుగా మన పరిసరాలను మనమే బాగు చేసుకోవాలి’ అని అఖిల్ పేర్కొన్నాడు. అయితే, దీనిపై నెటిజన్ల నుంచి ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వెల్లువెత్తడంతో అతడు ఆ వీడియో కామెంట్లను డిసేబుల్ చేశాడు. బెంగుళూరులో గుంతలే లేవని, అదంతా కేవలం సోషల్ మీడియా సృష్టేనని గతంలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వ్యాఖ్యానించడం గమనార్హం. ఈ నేపథ్యంలో తాజా వీడియో ప్రభుత్వ తీరును మరోసారి చర్చకు తెచ్చింది.

Next Story