21 దీవులకు పరమవీర పురస్కార గ్రహీతల పేర్లు నామకరణం చేసిన PM

by Disha Web Desk |
21 దీవులకు పరమవీర పురస్కార గ్రహీతల పేర్లు నామకరణం చేసిన PM
X

దిశ, డైనమిక్ బ్యూరో : నేతాజీ సుభాష్​చంద్రబోస్ 126వ జయంతి (పరాక్రమ్‌ దివస్‌)ని పురస్కరించుకొని ఇప్పటివరకు పేరులేని అండమాన్, నికోబార్‌లోని 21 ద్వీపాలకు ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరమవీర చక్ర అవార్డు గ్రహీతల పేర్లు నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌‌షా కూడా పాల్గొన్నారు. ఏటా జనవరి 23న నేతాజీ జయంతిని పురస్కరించుకొని, పరాక్రమ్‌ దివస్‌గా నిర్వహిస్తూ నివాళులర్పిస్తోన్న కేంద్రం.. ఈ సారి అండమాన్, నికోబార్‌లలోని పేరు లేని అతిపెద్ద దీవులకు పేర్లు పెట్టేందుకు సంకల్పించింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జ్ఞాపకార్థం అండమాన్ –నికోబార్ దీవుల చారిత్రక ప్రాముఖ్యతను పురస్కరించుకుని, ప్రధాన మంత్రి 2018లో ద్వీపాన్ని సందర్శించిన సందర్భంగా రోజ్ దీవులకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ద్వీప్ అని నామకరణం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ద్వీపంలో నిర్మించబోయే నేతాజీ​జాతీయ స్మారక చిహ్నం నమూనాను మోడీ ఆవిష్కరించారు. దేశం కోసం జీవితాన్ని, ప్రాణాన్ని త్యాగం చేసిన రియల్ హీరోస్‌కు ప్రధాని మోడీ ఈ విధంగా వారికి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ...'ఈ అండమాన్‌ గడ్డ మీదే మొదటిసారి మన త్రివర్ణపతాకం రెపరెపలాడింది. స్వతంత్ర భారత్‌కు చెందిన ప్రభుత్వం మొదట ఇక్కడే ఏర్పాటైంది. ఈరోజు నేతాజీ సుభాశ్‌ చంద్రబోస్‌ జయంతి. ఈ రోజును దేశం పరాక్రమ్‌ దివస్‌గా నిర్వహిస్తోంది. ఈ 21 మందికి దేశమే అన్నింటికంటే ముఖ్యం. ఈ పేర్లు పెట్టడం ద్వారా వారి తీర్మానం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. అలాగే అండమాన్‌ అభివృద్ధి దిశగా ఎనిమిదేళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది'అని అన్నారు.

అండమాన్ దీవుల్లో పేరులేని పెద్ద దీవికి మొదటి పరమ్‌ వీర్ చక్ర గ్రహీత మేజర్ సోమ్‌నాథ్‌ శర్మ పేరుతో నామకరణం చేశారు. నవంబర్ 3,1947లో శ్రీనగర్ విమానాశ్రయం వద్ద పాక్‌ చొరబాటుదారులతో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు. ఇలా మొత్తం 21 దీవులకు పేర్లు పెట్టారు. కాగా, ప్రధాని మోడీ పరమవీర చక్రగ్రహీతల పేర్లు పెట్టడంపై బాలీవుడ్ హీరోలు స్పందించారు. "రియల్ హీరోలను" గౌరవించినందుకు ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయం పట్ల తాము గర్వపడుతున్నామని పేర్కొన్నారు. దీవుల పేరు మార్చడంపై నటులు అజయ్ దేవగన్, సిద్ధార్థ్ మల్హోత్రా, సునీల్‌శెట్టి హర్షం వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేశారు. దేశానికి నిజమైన హీరోలు అని అభివర్ణించారు. ముగ్గురు నటీనటులు తమ సినిమాల్లో పరమవీర చక్ర అవార్డు గ్రహీతల పాత్రను పోషించారు.

21 మంది పరమవీర చక్ర అవార్డు గ్రహీతల పేర్లు ఇవే..

మేజర్ సోమనాథ్ శర్మ, సుబేదార్ – హోనీ కెప్టెన్ (అప్పటి లాన్స్ నాయక్) కరమ్ సింగ్, 2వ లెఫ్టినెంట్ రామ రఘోబా రాణే, నాయక్ జాదునాథ్ సింగ్, కంపెనీ హవల్దార్ మేజర్ పిరు సింగ్, కెప్టెన్ జీఎస్ సలారియా లెఫ్టినెంట్ కల్నల్ (అప్పటి మేజర్) ధన్ సింగ్ థాపా, సుబేదార్ జోగిందర్ సింగ్, మేజర్ షైతాన్ సింగ్, సీక్యూఎంహెచ్ అబ్దుల్ హమీద్, లెఫ్టినెంట్ కల్నల్ అర్దేషిర్ బుర్జోర్జీ తారాపూర్, లాన్స్ నాయక్ ఆల్బర్ట్ ఎక్కా, మేజర్ హోషియార్ సింగ్, 2వ లెఫ్టినెంట్ అరుణ్ ఖేత్రపాల్, ఫ్లయింగ్ ఆఫీసర్ నిర్మల్‌జిత్ సింగ్ సెఖోన్, మేజర్ రామస్వామి పరమేశ్వరన్, నాయబ్ సుబేదార్ బనా సింగ్, కెప్టెన్ విక్రమ్ బాత్రా, లెఫ్టినెంట్ మనోజ్ కుమార్ పాండే, సుబేదార్ మేజర్ (అప్పటి రైఫిల్ మాన్) సంజయ్ కుమార్, సుబేదార్ మేజర్ రిటైర్డ్ (హానీ కెప్టెన్) గ్రెనేడియర్ యోగేంద్ర సింగ్ యాదవ్.

ఇవి కూడా చదవండి : పిరికి మాటలు మాట్లాడకండి.. వినకండి: జనసేన చీఫ్ పవన్ కల్యాణ్


Next Story

Most Viewed