అమెరికా నుంచి భారత్‌కి చేరుకున్న చివరి బ్యాచ్ అపాచీ హెలికాప్టర్లు

by Malleboina Mahesh |

భారత సైన్యం (Indian Army) కోసం అమెరికా నుంచి రావాల్సిన అత్యంత ఆధునికమైన AH-64E అపాచీ అటాక్ హెలికాప్టర్ల చివరి బ్యాచ్ ఎట్టకేలకు భారత్ చేరుకుంది.

అమెరికా నుంచి భారత్‌కి చేరుకున్న చివరి బ్యాచ్ అపాచీ హెలికాప్టర్లు
X

దిశ, వెబ్ డెస్క్: భారత సైన్యం (Indian Army) కోసం అమెరికా నుంచి రావాల్సిన అత్యంత ఆధునికమైన AH-64E అపాచీ అటాక్ హెలికాప్టర్ల చివరి బ్యాచ్ ఎట్టకేలకు భారత్ చేరుకుంది. ఈ రాకతో భారత సైన్యం ఆర్డర్ చేసిన మొత్తం ఆరు అపాచీ హెలికాప్టర్ల సరఫరా పూర్తయినట్లు భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం బుధవారం వెల్లడించింది. వాస్తవానికి ఈ ఏడాది ఫిబ్రవరి - మార్చి నాటికే రావాల్సిన ఈ హెలికాప్టర్ల సరఫరా పలుమార్లు జాప్యం చెందింది. ఈ మైలురాయిని ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడి సంయుక్త ప్రకటనలో చేసుకున్న రక్షణ ఒప్పందాల అమలులో భాగంగా ఒక కీలక అడుగుగా అమెరికా ఎంబసీ పేర్కొంది.

తాజాగా వచ్చిన మూడు హెలికాప్టర్లతో కలిపి మొత్తం ఆరు అపాచీలను రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ కేంద్రంగా మోహరించనున్నట్లు సైన్యం తెలిపింది. ఈ AH-64E వెర్షన్ 6 హెలికాప్టర్లు అత్యంత ఆధునిక సెన్సార్లు, లాంగ్‌బౌ ఫైర్ కంట్రోల్ రాడార్, హెల్‌ఫైర్ క్షిపణులు, నైట్ విజన్ వంటి అత్యాధునిక ఫీచర్లను కలిగి ఉన్నాయి. ఇవి సంక్లిష్టమైన యుద్ధ క్షేత్రాలలో శత్రువులను సమర్థవంతంగా ఎదుర్కోగలవు. భారత వాయుసేన (IAF) వద్ద ఇప్పటికే 22 అపాచీలు ఉండగా, ఇప్పుడు సైన్యానికి ఇవి అందడం వల్ల దేశ రక్షణ సామర్థ్యం మరింత పెరిగింది. శిక్షణ , సాంకేతిక మార్పిడిలో అమెరికాతో సహకారాన్ని ఇవి మరింత బలోపేతం చేస్తాయని ప్రభుత్వం ఆశిస్తోంది.

Next Story