- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డీలిమిటేషన్పై కేంద్రం అధికారిక స్పష్టత.. అపోహలకు చెక్
దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతున్న నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకూ స్పష్టతనిచ్చింది.

దిశ, వెబ్డెస్క్: దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతున్న నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకూ స్పష్టతనిచ్చింది. ప్రస్తుతం ఉన్న లోక్సభ, అసెంబ్లీ సీట్ల సంఖ్యలో 50 శాతం పెంపు ఉంటుందని కేంద్రం అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు బిల్లులో నిబంధనలను పొందుపరిచినట్లు సమాచార శాఖ స్పష్టం చేసింది. డీలిమిటేషన్ ప్రక్రియ కేవలం 2011 జనాభా లెక్కల ఆధారంగానే జరుగుతుందని గతకొన్ని రోజులుగా సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రచారాన్ని కేంద్రం కొట్టిపారేసింది. అటువంటి వార్తల్లో నిజం లేదని, అపోహలను నమ్మవద్దని సూచించింది. జనాభా ప్రాతిపదికన మాత్రమే కాకుండా, భౌగోళిక విస్తీర్ణం, ఇతర శాస్త్రీయ అంశాలను పరిగణనలోకి తీసుకుని సీట్ల పెంపు ఉంటుందని కేంద్రం సంకేతాలిచ్చింది.
50% పెంపు...
ప్రస్తుతమున్న సీట్ల సంఖ్యకు అదనంగా సగం సీట్లు పెరగనున్నాయి. దీనివల్ల పెద్ద రాష్ట్రాలతో పాటు చిన్న రాష్ట్రాలకు కూడా ప్రాతినిధ్యం పెరుగుతుంది. పునర్విభజన విధివిధానాలు బిల్లులో స్పష్టంగా ఉన్నాయని, చట్టపరమైన ప్రక్రియ ప్రకారమే ఇది జరుగుతుందని సమాచార శాఖ పేర్కొంది. ఈ అంశంపై పార్లమెంటులో జరిగే చర్చ సందర్భంగా పూర్తిస్థాయిలో క్లారిటీ ఇస్తామని, విపక్షాల సందేహాలను నివృత్తి చేస్తామని కేంద్రం ప్రకటించింది. నియోజకవర్గాల సంఖ్య 50 శాతం పెరగడం వల్ల దేశవ్యాప్తంగా రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాల సంఖ్య భారీగా పెరగనుంది. దీనివల్ల అటు లోక్సభలో, ఇటు అసెంబ్లీలలో నూతన నాయకత్వానికి అవకాశం లభిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.






