కశ్మీర్‌లో కలకలం.. బీజేపీ మాజీ సర్పంచ్ హత్య, జైపూర్ జంటపై కాల్పులు

by Hajipasha |
కశ్మీర్‌లో కలకలం.. బీజేపీ మాజీ సర్పంచ్ హత్య, జైపూర్ జంటపై కాల్పులు
X

దిశ, నేషనల్ బ్యూరో : లోక్‌సభ ఎన్నికల ఐదో విడత పోలింగ్ ఘట్టం అత్యంత సమీపించిన తరుణంలో జమ్మూకశ్మీర్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గామ్‌లో శనివారం ఉదయం ఇద్దరు జైపూర్ (రాజస్థాన్) పర్యాటకులపై ఉగ్రవాదులు తుపాకీతో కాల్పులకు తెగబడ్డారు. దీంతో యన్నార్, తబ్రేజ్ దంపతులకు గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆస్పత్రిలో చేర్పించారు. ఇక దక్షిణ కాశ్మీర్‌లోని షోపియాన్‌లోని హీర్‌పోరాలో జరిగిన మరో ఉగ్రదాడి ఘటనలో బీజేపీ మాజీ సర్పంచ్ ఏజాజ్ అహ్మద్ హత్యకు గురయ్యారు. పహల్గాం, షోపియాన్‌లలో జరిగిన ఉగ్రదాడిని జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ, జేకేఎన్సీ అధ్యక్షుడు డాక్టర్ ఫరూక్ అబ్దుల్లా, వైస్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లా ఖండించారు. ఇటువంటి క్రూరత్వ చర్యలు కశ్మీర్‌లో దీర్ఘకాలిక శాంతిని సాధించడానికి తీవ్రమైన ఆటంకంగా మారాయని వారు చెప్పారు. పహల్గామ్ ఉగ్రదాడి వెనుక తామే ఉన్నామని లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు అనుబంధంగా పనిచేసే ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్) ప్రకటించింది. ఇక ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన బీజేపీ మాజీ సర్పంచ్ ఏజాజ్.. పలు వైరల్ వీడియోలలో ప్రధాని మోడీపై ప్రశంసల జల్లు కురిపించారు.

Next Story

Most Viewed