కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం

by Disha Web Desk 17 |
కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం
X

మైసూర్: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇన్నోవా కారును ఓ ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకే ఫ్యామిలీకి చెందిన 10 మంది అక్కడికక్కడే మృతిచెందారు. బళ్లారి నుంచి కారులో మైసూరుకు బయలుదేరిన కుటుంబం గమ్యస్థానానికి చేరుకోక ముందే మృత్యు ఒడికి చేరింది. మైసూరు జిల్లాలోని తిరుమకుడలు-నరసీపూర్ సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్‌ కింద రూ. 2 లక్షలు చొప్పున పరిహారాన్ని ప్రకటించారు.

అయితే ప్రమాదంలో గాయపడ్డ మరికొందరిలో ముగ్గురి పరిస్థితి సీరియస్‌గా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బళ్లారికి చెందిన ఓ కుటుంబం ఇన్నోవా కారులో మైసూరు ట్రిప్‌ కు బయల్దేరింది. మార్గమధ్యలో వీరు ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న ఓ ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. దీంతో ఇద్దరు చిన్నారులు సహా 10 మంది అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జయింది.

దీంతో అందులో చిక్కుకున్న వారిని బయటకు తీయడం కష్టంగా మారిందని స్థానికులు తెలిపారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. "కారులో ప్రయాణిస్తున్న వారు బళ్లారికి చెందిన వారు. మలే మాదేశ్వరుడిని దర్శించుకుని మైసూరు వైపు వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది" అని మైసూరు జిల్లా ఎస్పీ సీమా లత్కర్ తెలిపారు.

24 గంటల వ్యవధిలో రెండో ఘటన..

సరిగ్గా 24 గంటల క్రితం కర్ణాటకలోని కొప్పల్ జిల్లాలో కూడా ఇదే తరహాలో ఓ కారు లారీని ఢీకొట్టింది. విజయపూర్‌ నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఇండికా కారు టైరు పగిలి అదుపు తప్పి లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. అయితే 24 గంటల్లో వరుసగా రెండు యాక్సిడెంట్‌లు జరగడం, 16మంది చనిపోవడంతో జనం భయాందోళనకు గురవుతున్నారు.

బస్సును ఢీకొన్న ట్రక్కు.. 10 మందికి గాయాలు

మహారాష్ట్రలో జరిగిన మరో ప్రమాదంలో పది మంది ప్రయాణికులు గాయపడ్డారు. ఠానే జిల్లాలోని ముంబయి- నాసిక్​ జాతీయ రహదారిపై ఓ బస్సును ట్రక్కు ఢీ కొట్టింది. ఈ ఘటనలో గాయపడిన వారిని స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు.



Next Story