ఆలయంలో అగ్ని ప్రమాదం: 14 మంది పూజారులకు గాయాలు

by Dishanational2 |
ఆలయంలో అగ్ని ప్రమాదం: 14 మంది పూజారులకు గాయాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: మధ్యప్రదేశ్‌లో హోలీ సందర్భంగా విషాదం చోటుచేసుకుంది. ఉజ్జయిని జిల్లాలోని మహాకాలేశ్వర ఆలయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో 14మంది పూజారులకు గాయాలయ్యాయి. ఆలయ గర్భగుడిలో సోమవారం ఉదయం భస్మ హారతి ఇస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న పూజారులకు మంటలు అంటుకున్నాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు చేపట్టి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. గాయపడిన పూజారులను ఆస్పత్రికి తరలించారు. అందులో 9మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై మెజిస్ట్రేట్ విచారణకు ఆదేశించినట్టు ఉజ్జయిని కలెక్టర్ నీరజ్ సింగ్ తెలిపారు. ఘటనకు గల కారణాలను వెల్లడించలేదు. అయితే హారతి ఇస్తున్న సమయంలో పూజారిపై వెనుక నుంచి ఎవరో గులాల్ పోశారని అక్కడున్న భక్తులు తెలిపారు. గులాల్ దీపం మీద పడటంతో మంటలు వ్యాపించినట్టు వెల్లడించారు. ప్రమాదం జరిగిన సమయంలో వేలాది మంది భక్తులు ఆలయంలో హోలీ సంబురాలు జరుపుకుంటున్నట్టు తెలుస్తోంది.



Next Story