పారిశుధ్య కార్మికురాలి నిజాయితీకి పట్టం.. మానవత్వం చాటిన తమిళ నటులు, సీఎం

by Ramesh Naini |

ఈ రోజుల్లో బంగారం ధర ఆకాశాన్ని తాకుతుంటే.. మనుషుల నిజాయితీ మాత్రం పాతాళానికి పడిపోతోందన్న మాటలు తరచూ వినిపిస్తుంటాయి.

పారిశుధ్య కార్మికురాలి నిజాయితీకి పట్టం.. మానవత్వం చాటిన తమిళ నటులు, సీఎం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఈ రోజుల్లో బంగారం ధర ఆకాశాన్ని తాకుతుంటే.. మనుషుల నిజాయితీ మాత్రం పాతాళానికి పడిపోతోందన్న మాటలు తరచూ వినిపిస్తుంటాయి. కానీ, చెన్నైకి చెందిన ఓ పారిశుధ్య కార్మికురాలు మాత్రం ఆ మాటలను నిజం కాదని తేల్చి చెప్పారు. చెత్తలో దొరికిన భారీ మొత్తంలో బంగారాన్ని ఏమాత్రం ఆశపడకుండా తిరిగి ఇచ్చేసి, మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపించింది. ఆమె నిజాయితీకి మెచ్చిన తమిళ చిత్ర పరిశ్రమ ఇప్పుడు ఆమెకు నీరాజనాలు పలుకుతోంది.

అసలేం జరిగిందంటే..?

చెన్నైలో పారిశుధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న పద్మ.. ఎప్పటిలాగే తన విధుల్లో భాగంగా చెత్త సేకరణ చేస్తుండగా ఆమెకు ఒక బ్యాగ్ దొరికింది. అందులో సుమారు 30 తులాల (రూ.45 లక్షల విలువ గల) బంగారు ఆభరణాలు ఉన్నాయి. కష్టాల్లో ఉన్నా సరే, ఆ బంగారాన్ని చూసి ఆమె మనసు మారలేదు. వెంటనే ఆ బ్యాగును పోలీసులకు అప్పగించి, అది అసలు యజమానులకు చేరేలా చేసింది.

‘ప్రపంచ సుందరి’ అంటూ పాదపూజ

కార్మికురాలు పద్మ నిజాయితీ గురించి తెలుసుకున్న విలక్షణ నటుడు, దర్శకుడు పార్తీబన్ ఆమెను ఘనంగా సత్కరించారు. చెన్నైలోని ఎతిరాజ్ కాలేజీకి అతిథిగా వెళ్లిన ఆయన.. తనతో పాటు పద్మను కూడా తీసుకెళ్లారు. ‘నన్ను గెస్ట్‌గా పిలిచారు.. కానీ ఈ కార్యక్రమానికి అసలైన 'చీఫ్ గెస్ట్' ఆమే’ అంటూ ఆమెను వేదికపైకి ఆహ్వానించారు. అందరి సమక్షంలో ఆమెకు పాదపూజ చేసి, కొత్త చీరను బహుకరించారు. అంతేకాకుండా, ఆమె తలపైన ‘ప్రపంచ సుందరి’ (Miss World) కిరీటాన్ని పెట్టి గౌరవించారు. ఈ సందర్భంగా పార్తీబన్ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. "బంగారం ధర పెరుగుతున్న కొద్దీ, మానవత్వం విలువ తగ్గిపోతోంది. కానీ, పద్మ తన నిజాయితీతో ఆ మాటకు అర్థం మార్చారు. చెత్తలో దొరికిన 360 గ్రాముల బంగారాన్ని తిరిగిచ్చి, ఆమె ప్రపంచంలోనే అత్యున్నత మనిషిగా అవతరించారు. అందుకే ఆమెకు కిరీటం పెట్టి నేను గర్వపడుతున్నాను" అని రాసుకొచ్చారు.

సూపర్ స్టార్ రజినీ, సీఎం స్టాలిన్ రివార్డు..

పద్మ నిజాయితీకి ముగ్ధుడైన సూపర్ స్టార్ రజినీకాంత్ ఇటీవల ఆమెను తన నివాసానికి ప్రత్యేకంగా ఆహ్వానించిన విషయం తెలిసిందే. ఆమె చేసిన పనిని అభినందిస్తూ శాలువాతో సత్కరించి, ఓ బంగారు గొలుసును కానుకగా ఇచ్చారు. కాగా, అంతకుముందే పద్మ నిజాయితీని గుర్తిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ ఆమెను పిలిపించి అభినందించడంతో పాటు, రూ. 1 లక్ష రివార్డును అందజేశారు. ఒక సామాన్య పారిశుధ్య కార్మికురాలు చూపిన నిజాయితీ, ఇప్పుడు ఆమెను సెలబ్రిటీల మన్ననలు పొందేలా చేసింది.

Next Story