Tahawwur Rana: ముంబై దాడుల ప్లాన్ చెబుతూంటే రాణా పగలబడి నవ్వాడు

by Shamantha N |
Tahawwur Rana: ముంబై దాడుల ప్లాన్ చెబుతూంటే రాణా పగలబడి నవ్వాడు
X

దిశ, నేషనల్ బ్యూరో: ముంబై దాడుల్లో కీలక సూత్రధారి తహవూర్ రాణా గురించి సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. కాగా.. దాడులకు సిద్ధం చేసిన ప్లాన్ గురించి చెబుతుంటే రాణా పగలబడి నవ్వినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అతడే స్వయంగా అమెరికా కోర్టుల తెలిపాడు. అయితే, ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లష్కరే తోయిబా ఉగ్రసంస్థ కోసం పాక్-అమెరికన్‌ డేవిడ్‌ కోల్‌మన్‌ హెడ్లీ భారత్‌లో రెక్కీ నిర్వహించాడు. 2008 మే నెలలో హెడ్లీ ముంబైలో బోట్‌ ట్రిప్‌ పూర్తిచేసుకున్నాడు. ఆ తర్వాతే రాణాకు ఫోన్ చేశాడు. తాజ్‌ హోటల్స్‌ వద్ద ఉగ్రవాదులు బోట్‌లో వచ్చి ల్యాండ్‌ అయ్యుంటారని పేర్కొన్నాడు. తాజ్‌ హోటల్‌ను లష్కర్‌ మోడల్‌ హోటల్‌గా పేర్కొన్నాడు. అప్పుడు తాను నవ్వినట్లు అమెరికా కోర్టుకు అతడే వెల్లడించాడు.

టెర్రరిస్టు క్యాంపులకు..

2002, 2005 సంవత్సరాల్లో, ఆ తర్వాత కూడా మొత్తం ఐదుసార్లు టెర్రరిస్టు క్యాంప్‌లకు హాజరైనట్లు హెడ్లీ అంగీకరించాడు. ఆ సమయంలో భారత్‌లో పర్యటించి రెక్కీలు నిర్వహించాలని లష్కరే అతడికి సూచించింది. దీంతో అతడు ముంబై దాడుల వరకు ఐదుసార్లు భారత్‌ను సందర్శించాడు. అప్పుడే ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు హెడ్లీతో మాట్లాడుతూ ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు ముంబైలో ఇమిగ్రేషన్‌ ఆఫీస్‌ను తెరవాలని సూచించారు. ఆ తర్వాత అదే విషయాన్ని హెడ్లీ రాణాకు చెప్పాడు. వీరిద్దరూ చర్చించుకొన్న తర్వాత ముంబైలో రాణాకు చెందిన ఫస్ట్‌ వరల్డ్‌ ఇమిగ్రేషన్‌ ఆఫీసును తెరిచేందుకు అంగీకరించారు. అయితే, హెడ్లీ ముంబై మిషన్ కోసం రాణానే కవర్‌ స్టోరీ సృష్టించేందుకు అతడిని తన ఇమిగ్రేషన్‌ వ్యాపార సంస్థ రీజనల్‌ మేనేజర్‌గా చూపించాడు. అతడిని ముంబై పంపించేందుకు తన సంస్థలోని ఓ వ్యక్తిని నియమించి హెడ్లీ తండ్రి, ఇతర వివరాలను దాచిపెట్టారు. ప్రస్తుతం ఆ వ్యక్తి కూడా ఎన్‌ఐఏ రాడార్‌లోనే ఉన్నాడు. కాగా.. రాణా ట్రావెల్‌ ఏజెన్సీ కోసం పనిచేసిన వ్యక్తి వివరాల కోసం ఇప్పుడు ఎన్ఐఏ వెతుకుతోంది. ఈక్రమంలో రాణా గతంలో పాక్‌ ఉగ్రసంస్థలకు చెందిన పలువురు వ్యక్తులకు కూడా సాయం చేసి ఉంటాడని జాతీయ దర్యాప్తు సంస్థ అనుమానిస్తోంది.

Next Story

Most Viewed