ఈసీల నియామకాలపై ‘సుప్రీం’ అత్యవసర విచారణ

by Dishanational4 |
ఈసీల నియామకాలపై ‘సుప్రీం’ అత్యవసర విచారణ
X

దిశ, నేషనల్ బ్యూరో : కేంద్ర ఎన్నికల సంఘంలో ప్రస్తుతం ప్రధాన ఎన్నికల కమిషనర్ మాత్రమే ఉన్నారు. ఖాళీగా ఉన్న రెండు కేంద్ర ఎన్నికల కమిషనర్ పోస్టుల భర్తీకి కేంద్ర న్యాయశాఖ ఏర్పాటుచేసిన సెర్చ్ కమిటీ కసరత్తును మొదలుపెట్టింది. అది చేసే సిఫారసుల ఆధారంగా త్వరలోనే ఇద్దరు కేంద్ర ఎన్నికల కమిషనర్ల పేర్లను ప్రధాని మోడీ ప్రకటిస్తారని అంటున్నారు. ఈనేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన ఎన్నికల అధికారి, ఎన్నికల కమిషనర్ల నియామకాల కోసం కొత్తగా తీసుకొచ్చిన చట్టాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై అత్యవసర విచారణ చేపట్టాలని అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్ (ఏడీఆర్‌) తాజాగా దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించింది. ఇందుకు అంగీకరించిన సుప్రీంకోర్టు శుక్రవారం రోజు విచారణ జరుపుతామని వెల్లడించింది. గత నెలలోనే కేంద్ర ఎన్నికల కమిషనర్‌ అనూప్‌ చంద్ర పాండే పదవీ విరమణ చేయగా.. ఇటీవల మరో కేంద్ర ఎన్నికల కమిషనర్‌ అరుణ్‌ గోయెల్‌ అనూహ్యంగా రాజీనామా చేశారు. దీంతో ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘంలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ ఒక్కరే మిగిలారు.

కొత్త చట్టం ఏం చెబుతోంది ?

ఎన్నికల కమిషనర్ల నియామకాలపై పార్లమెంటులో చట్టం చేసేవరకు.. ప్రధానమంత్రి నేతృత్వంలో లోక్‌సభలో విపక్ష నేత, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) కలిసి సీఈసీ, ఈసీల నియామకాలను చేపట్టాలని 2023 మార్చిలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అయినప్పటికీ సీఈసీ, ఈసీల నియామకం, వారి సర్వీసు నిబంధనలకు సంబంధించి గతేడాది డిసెంబరులో కేంద్రం కొత్త చట్టం అమల్లోకి తెచ్చింది. దాని ప్రకారం.. ఈసీల నియామక బాధ్యతలను సెర్చ్‌, ఎంపిక కమిటీలు నిర్వహించనున్నాయి. ఎంపిక కమిటీలో సీజేఐ స్థానంలో ప్రధాని సూచించిన కేంద్రమంత్రిని చేర్చారు. దీన్ని సవాల్‌ చేస్తూనే తాజాగా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.



Next Story