Supreme: దల్లేవాల్ కు వైద్యసాయం అందేలా చూడాలి.. పంజాబ్ సర్కారుపై సుప్రీంకోర్టు ఆదేశం

by Shamantha N |

రైతు సంఘాల నిరవధిక దీక్ష విషయంలో పంజాబ్ ప్రభుత్వం తీరుపై సుప్రీంకోర్టు(Supreme Court) ఆగ్రహం వ్యక్తం చేసింది.

Supreme: దల్లేవాల్ కు వైద్యసాయం అందేలా చూడాలి.. పంజాబ్ సర్కారుపై సుప్రీంకోర్టు ఆదేశం
X

దిశ, నేషనల్ బ్యూరో: రైతు సంఘాల నిరవధిక దీక్ష విషయంలో పంజాబ్ ప్రభుత్వం తీరుపై సుప్రీంకోర్టు(Supreme Court) ఆగ్రహం వ్యక్తం చేసింది. డిసెంబర్ 31 లోగా నిరవధిక దీక్ష చేస్తున్న రైతు నాయకుడు జగ్జీత్‌ సింగ్‌ దల్లేవాల్‌ (Jagjit Singh Dallewal) ను ఆస్పత్రికి తరలించేలా చూడాలంది. దల్లేవాల్‌కు వైద్యసహాయం అందేలా చూడాలని గతంలోనే పంజాబ్‌ ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చామని గుర్తుచేసింది. అయితే, వాటిని అమలుచేయడంలో పంజాబ్ చేస్తున్న ప్రయత్నాలపై కోర్టు సంతృప్తి చెందలేదని జస్టిస్‌ సూర్యకాంత్‌ అన్నారు. ఈ విషయంలో పంజాబ్ రాష్ట్రానికి ఏదైనా సహాయం అవసరమైతే, కేంద్ర ప్రభుత్వం మద్దతివ్వాలని సుప్రీం తన ఆదేశాల్లో పేర్కొంది. ఈ కేసుపై తదుపరి విచారణను డిసెంబర్ 31న చేపట్టనున్నట్లు వెల్లడించింది.

రైతు సంఘాలపై ఆగ్రహం

అంతేకాకుండా రైతు సంఘాల నేతలపై సుప్రీంకోర్టు (Supreme Court) ఆగ్రహం వ్యక్తంచేసింది. ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రైతు దల్లేవాల్‌ ఆరోగ్యం రోజురోజుకీ క్షీణిస్తున్నా.. ఆయనకు వైద్య సహాయం అందకుండా అడ్డుకుంటున్న రైతు సంఘాల తీరును తప్పుబట్టింది. దల్లేవాల్ క్షేమం కోరుకుంటే ఆయనకు వైద్యసాయం చేయకుండా అడ్డుకోరనే విషయాన్ని వారికి తెలియజేయాలని జస్టిస్‌ సూర్యకాంత్‌ పంజాబ్‌ చీఫ్‌ సెక్రటరీకి సూచించారు. వైద్య సహాయం అందించాలన్న ఆదేశాలను అమలుచేయకుండా కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (డీజీపీ)కు వ్యతిరేకంగా దాఖలైన వ్యాజ్యంపై విచారణలో భాగంగా అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. అందులో భాగంగానే ఈ వ్యాఖ్యలు చేసింది. ఇకపోతే, పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడం వంటి డిమాండ్లతో నవంబరు 26 నుంచి జగ్జీత్‌ సింగ్‌ దల్లేవాల్‌ పంజాబ్‌-హర్యానా సరిహద్దులోని ఖనౌరీ శిబిరం వద్ద నిరవధిక నిరసన దీక్ష చేపట్టింది.

Next Story