నిందితులను జైల్లోనే ఉంచేందుకు ఛార్జిషీట్లా ? ఈడీకి ‘సుప్రీం’ మొట్టికాయలు

by Dishanational4 |
నిందితులను జైల్లోనే ఉంచేందుకు ఛార్జిషీట్లా ? ఈడీకి ‘సుప్రీం’ మొట్టికాయలు
X

దిశ, నేషనల్ బ్యూరో : మనీ లాండరింగ్‌ కేసుల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌) విచారణ తీరును సుప్రీంకోర్టు తప్పుపట్టింది. డీఫాల్ట్ బెయిల్ పొందకుండా అడ్డుకొని నిందితులను నిరవధికంగా జైల్లోనే ఉంచేలా వరుసపెట్టి అనుబంధ ఛార్జ్‌షీట్లు దాఖలు చేస్తుండటం సరికాదని వ్యాఖ్యానించింది. ఈడీ అనుసరిస్తున్న ఈ తరహా పద్ధతి దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఇబ్బందికి గురిచేస్తోందని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ‘‘విచారణ పూర్తయ్యేంతవరకు నిందితులను అరెస్టు చేయకూడదనేది డీఫాల్ట్‌ బెయిల్‌ ముఖ్య ఉద్దేశం. కేసులో దర్యాప్తు పూర్తయ్యేవరకు నిందితుడిని విచారణ చేయొద్దని మీరు చెప్పలేరు. అరెస్టు కూడా చేయడానికి వీలులేదు. అనుబంధ ఛార్జిషీట్లు దాఖలు చేస్తూ.. విచారణ లేకుండా నిందితులను నిరవధికంగా జైల్లోనే ఉంచలేరు’’ అని ఈడీ తరఫున హాజరైన అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ ఎస్‌వీ రాజుకు సుప్రీంకోర్టు బెంచ్ సూచించింది. తాజాగా బుధవారం ఉదయం విచారించిన ఓ మనీలాండరింగ్ కేసులో ఓ వ్యక్తి గత 18 నెలలుగా జైల్లోనే ఉన్నాడని, ఇది తమనెంతో ఇబ్బందికి గురి చేసిందని సాక్షాత్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించడం గమనార్హం. ఇలాంటి పరిస్థితి ఎవరికీ ఎదురు కావద్దంటే.. నిందితుడిని అరెస్టు చేసినప్పుడే విచారణ మొదలు కావాలని స్పష్టం చేసింది. కాగా, సీఆర్‌పీసీ ప్రకారం నిర్దేశించిన గడవులోగా అధికారులు దర్యాప్తు పూర్తి చేయకపోయినా.. తుది ఛార్జిషీటు దాఖలు చేయకున్నా అరెస్టైన వ్యక్తి డీఫాల్ట్‌ బెయిల్‌‌ను పొందేందుకు అర్హుడు.


Next Story

Most Viewed