డిజిటల్ అరెస్టులతో రూ.3 వేల కోట్లు స్వాహా.. సుప్రీంకోర్టు సీరియస్

by Phanindra |

దేశవ్యాప్తంగా డిజిటల్ అరెస్టులతో రూ.3 వేల కోట్లు కొట్టేసినట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఈ వివరాలపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది.

డిజిటల్ అరెస్టులతో రూ.3 వేల కోట్లు స్వాహా.. సుప్రీంకోర్టు సీరియస్
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా డిజిటల్ అరెస్ట్ స్కామ్స్‌లో బాధితులు రూ.3 వేల కోట్లు కోల్పోవడంపై సుప్రీంకోర్టు దిగ్భ్రాంతి వ్యక్తంచేసింది. హర్యానాకు చెందిన ఒక వృద్ధ జంట రాసిన లేఖతో ఈ కేసును సుమోటోగా తీసుకున్న అత్యున్నత న్యాయస్థానం విచారణ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ స్కామ్స్‌కు సంబంధించిన వివరాలను సీల్డ్ కవర్‌లో కోర్టుకు సంబంధిత ఏజెన్సీలు సమర్పించాయి. ఈ వివరాలు తెలుసుకున్న జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాలా బాగ్జీ ధర్మస్థానం.. బాధితుల్లో అత్యధికంగా వృద్ధులే ఉన్న విషయాన్ని కూడా కోర్టు గుర్తించింది. ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవడం అత్యవసరమని వ్యాఖ్యానించింది.

‘మనదేశంలో మాత్రమే బాధితుల నుంచి రూ.3 వేల కోట్లు సేకరించారంటే చాలా షాకింగ్‌గా ఉంది. ఇప్పుడు ఈ సమస్యను పట్టించుకోకపోతే ఇది మరింత పెద్దదవుతుంది. అందుకే ఈ అంశంలో కఠినంగా వ్యవహరించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. అత్యంత కఠినమైన ఆదేశాలు ఇచ్చేందుకు కూడా వెనుకాడం’ అని న్యాయస్థానం తెలిపింది. ఈ సమస్యను పరిష్కరించకపోతే డిజిటల్ గవర్నెన్స్, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ వ్యవస్థపై ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తుందని కోర్టు అభిప్రాయపడింది.

Next Story