ఢిల్లీలోనే ఎందుకు? దేశమంతటా బాణాసంచా నిషేదించాలి.. సుప్రీం కీలక వ్యాఖ్యలు

by Ajay Maddhiboyina |

ఢిల్లీలోని ఎన్‌సీఆర్ (DELHI NCR) ప్రాంతంలో బాణాసంచా (FIRE CRACKERS) నిషేదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బాణాసంచా తయారీ దారులు, వ్యాపారులు దాఖలు చేసిన పిటిషన్‌లపై సుప్రీంకోర్టు (SUPREME COURT) శుక్రవారం విచారణ జరిపింది.

ఢిల్లీలోనే ఎందుకు? దేశమంతటా బాణాసంచా నిషేదించాలి.. సుప్రీం కీలక వ్యాఖ్యలు
X

దిశ‌, వెబ్ డెస్క్: ఢిల్లీలోని ఎన్‌సీఆర్ (DELHI NCR) ప్రాంతంలో బాణాసంచా (FIRE CRACKERS) నిషేదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బాణాసంచా తయారీ దారులు, వ్యాపారులు దాఖలు చేసిన పిటిషన్‌లపై సుప్రీంకోర్టు (SUPREME COURT) శుక్రవారం విచారణ జరిపింది. ఈ సందర్భంగా నిషేదం కేవలం ఢిల్లీలోని ఎన్‌సీఆర్‌కు మాత్రమే ఎందుకు వర్తిస్తుందని ప్రశ్నించింది. భారతదేశం (INDIA) అంతటా పౌరులు స్వచ్ఛమైన గాలిని పొందే హక్కును కలిగి ఉన్నారని పేర్కొంది. పండుగ సీజన్‌కు ముందు దీనిపై విచారణ జరగాల్సి ఉందని ధర్మాసనం అభిప్రాయపడింది.

బాణాసంచా కాలుష్యం గాలి నాణ్యతను మరింత దిగజార్చుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ఢిల్లీ ఎన్సీఆర్‌కు చెందిన ఉన్నత పౌరులకు స్వచ్ఛమైన గాలిని పొందే హక్కు ఉంటే ఇతర నగరాల ప్రజలకు ఆ హక్కు ఎందుకు ఉండకూడదని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్ అభిప్రాయపడ్డారు. బాణాసంచా నిషేదం దేశమంతటా అమలులో ఉండాలని ఆయన నొక్కిచెప్పారు. గత శీతాకాలంలో తాను అమృత్‌స‌ర్‌లో ఉన్నానని అక్కడ కాలుష్యం ఢిల్లీ కంటే దారుణంగా ఉందని తెలిపారు.

ఆయన వాదనకు మద్దతిస్తూ సీనియర్ న్యాయవాది అపరాజిత సింగ్... ఉన్నత వర్గాలు తమను తాము జాగ్రత్తగా చూసుకుంటాయని తెలిపారు. కాలుష్యం ఉన్నప్పుడు వాళ్లంతా ఢిల్లీని విడిచి ఇతర ప్రాంతాలకు వెళతారని తెలిపారు. ఇదిలా ఉంటే ఢిల్లీలోని ఎన్‌సీఆర్ ప్రాంతంలో బాణాసంచా కాల్చడంపై, అమ్మకాలపై కఠిన ఆంక్షలు ఉంటాయి. ఇక దేశవ్యాప్తంగా నిషేదిస్తే అలాంటి ఆంక్షలే దేశవ్యాప్తంగా అమలు చేసే అవకాశం ఉంది. త్వరలో దసరా, దీపావళి పండుగలు ఉండగా సుప్రీం బాణాసంచాపై చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

Next Story