Supreme court: చట్టాలు చేయడం శాసనసభల పని, గవర్నర్లది కాదు.. మూడు విపక్ష రాష్ట్రాల వాదనలు

by B.Srinivas |   (  Updated:2025-09-03 17:03:18  IST  )

రాష్ట్రపతి, గవర్నర్ ఆమోదం కోసం గడువు కోరుతూ రాష్ట్రాల దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు వరుసగా ఏడో రోజూ విచారణ చేపట్టింది.

Supreme court: చట్టాలు చేయడం శాసనసభల పని, గవర్నర్లది కాదు.. మూడు విపక్ష రాష్ట్రాల వాదనలు
X

దిశ, నేషనల్ బ్యూరో: అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు రాష్ట్రపతి, గవర్నర్ ఆమోదం కోసం గడువు కోరుతూ రాష్ట్రాల దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం వరుసగా ఏడో రోజూ విచారణ చేపట్టింది. పశ్చిమ బెంగాల్, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు అత్యున్నత న్యాయస్థానంలో తమ వాదనలు వినిపించాయి. బిల్లులను నిలుపుదల చేసే విచక్షణాధికారాలను వ్యతిరేకించాయి. చట్టాలను రూపొందించడం శాసనసభల పని అని, గవర్నర్లకు అందులో ఎలాంటి పాత్ర లేదని స్పష్టం చేశాయి. దీనికి సంబంధించి ఎటువంటి రూల్ సైతం లేదని పేర్కొన్నాయి. బిల్లును ఆమోదించాలని గడువు విధిస్తూ కోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేయడం ద్వారా రాజ్యాంగ ప్రాథమిక స్ఫూర్తిని బలహీనపరచాలని కేంద్ర ప్రభుత్వం కోరుకుంటుందని తెలిపాయి.

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులను గవర్నర్‌కు పంపాక ఆయన దానిపై సంతకం చేయాల్సి ఉంటుందని తెలిపారు. కానీ నిరంతరం వాయిదా వేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని చెప్పారు. అలాగే హిమాచల్ ప్రదేశ్ తరఫున మాజీ కేంద్ర మంత్రి ఆనంద్ శర్మ, కర్ణాటక తరఫున గోపాల్ సుబ్రమణియంలు వాదనలు వినిపించారు. సీజేఐ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించింది. వాదనలు విన్న తర్వాత తదుపరి విచారణను ఈనెల 9కి వాయిదా వేసింది.

Next Story