- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తప్పుడు కేసులతో అమాయకుల బలి: సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం
దేశంలో తప్పుడు కేసులు పెరిగిపోవడంపై సుప్రీంకోర్టు ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. దీనిపై కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: న్యాయ వ్యవస్థలో తప్పుడు ఫిర్యాదులు, కల్పిత ఆరోపణలు, ఫోర్జరీ సాక్ష్యాల వల్ల తలెత్తుతున్న విపరీతమైన ఇబ్బందులపై సుప్రీంకోర్టు స్పందించింది. న్యాయవాది అశ్విని కుమార్ ఉపాధ్యాయ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL)పై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్ మాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. దేశంలో తప్పుడు ఎఫ్ఐఆర్ (FIR)లు, కల్పిత సాక్ష్యాలతో క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ను దుర్వినియోగం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ కోరారు. ఈ అంశంపై పూర్తి వివరణ ఇవ్వాలని కోరుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కోర్టు నోటీసులు ఇచ్చింది. దీనిపై తదుపరి విచారణ మే 11న జరిగే అవకాశం ఉంది.
చట్టంలో లోపాలపై పిటిషనర్ ఆందోళన
భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (BNSS), 2023లోని సెక్షన్లు 215, 379ల వివరణ వల్ల తప్పుడు సాక్ష్యాలు ఇచ్చే వారిపై చర్యలు తీసుకోవడం కష్టతరమవుతోందని పిటిషనర్ పేర్కొన్నారు. కోర్టు ముందస్తు అనుమతి లేనిదే బాధితులు తప్పుడు ఫిర్యాదుదారులపై చర్యలు తీసుకోలేకపోతున్నారని, ఇది నేరగాళ్లకు వరంగా మారుతోందని వాదించారు. దీనివల్ల పోలీస్ స్టేషన్లు తప్పుడు ఎఫ్ఐఆర్లతో నిండిపోతున్నాయని, కోర్టులపై భారం పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆత్మహత్యలకు దారితీస్తున్న వేధింపులు
తప్పుడు కేసుల వల్ల సమాజానికి జరుగుతున్న నష్టం చాలా పెద్దదని పిటిషన్ పేర్కొంది. ఉత్తరప్రదేశ్ ఫతేపూర్ జిల్లాలో తప్పుడు కేసుల వేధింపులు తట్టుకోలేక ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఉదాహరణను కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. నిందారోపణలు ఎదుర్కొంటున్న అమాయకులు సామాజికంగా పరువు కోల్పోవడమే కాకుండా, సుదీర్ఘ కాలం పాటు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఆర్థికంగా, మానసిక కుంగుబాటుకు లోనవుతున్నారని పిటిషనర్ వివరించారు.
వ్యవస్థాగత లోపాలు - NCRB గణాంకాలు
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) దగ్గర తప్పుడు ఫిర్యాదులు లేదా కోర్టులో అబద్ధాలు చెప్పే (Perjury) కేసుల విచారణకు సంబంధించి ఖచ్చితమైన డేటా లేకపోవడం కూడా ఒక పెద్ద లోపమని పిటిషనర్ కోర్టుకు తెలిపారు. తప్పుడు సమాచారం ఇచ్చే వారిని, అబద్ధపు సాక్ష్యాలను సృష్టించే వారిని అడ్డుకోకపోతే ప్రాథమిక హక్కులకు భంగం కలుగుతుందని, న్యాయ ప్రక్రియ పట్ల ప్రజల్లో నమ్మకం తగ్గుతుందని పిటిషన్లో పేర్కొన్నారు.






