రామ్ దేవ్ బాబాపై సుప్రీంకోర్టు సీరియస్..సారీ చెప్పినా క్షమించని న్యాయస్థానం

by Dishanational2 |
రామ్ దేవ్ బాబాపై సుప్రీంకోర్టు సీరియస్..సారీ చెప్పినా క్షమించని న్యాయస్థానం
X

దిశ, నేషనల్ బ్యూరో: తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో పతంజలి వ్యవస్థాపకుడు బాబా రామ్ దేవ్, ఎండీ ఆచార్య బాలకృష్ణలపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఉద్దేశపూర్వకంగా కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారని తదుపరి కోర్టు ధిక్కార చర్యలకు సిద్ధం కావాలని జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అమానతుల్లాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. క్షమాపణలు కేవలం కాగితంపై మాత్రమే కనపడుతున్నాయని తెలిపింది. దీనిని అంగీకరించడానికి న్యాయస్థానం సిద్ధంగా లేదని వెల్లడించింది. కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగానే ఉల్లంఘించినట్టు భావిస్తున్నామని స్పష్టం చేసింది. ఈ కేసులో అంత ఉదారంగా వ్యవహరించాలనుకోవడం లేదని తెలిపింది.

కాగా, పతంజలి తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇస్తోందని ఆరోపిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం తప్పుడు ప్రకటనలు ఇవ్వొద్దని పతంజలికి సూచించింది. అలాగే పతంజలి సైతం గతేడాది నవంబర్‌లో తప్పుదోవ పట్టించే యాడ్స్ ఇవ్వబోమని సుప్రీంకోర్టుకు తెలిపింది. అయినప్పటికీ కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ మరోసారి ప్రకటనలు ఇవ్వడంతో న్యాయస్థానం గత వారమే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని పతంజలికి నోటీసులు సైతం జారీ చేసింది. దీంతో మంగళవారం(ఏప్రిల్ 9)న రామ్ దేవ్, బాలకృష్ణలు సుప్రీంకోర్టుకు క్షమాపణలు తెలిపారు. మరోసారి ఇటువంటి పొరపాటు జరగకుండా చూసుకుంటామని అఫిడ్ విట్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే మరోసారి బుధవారం అ అంశంపై అత్యున్నత న్యాయస్థానంలో విచారణ జరగగా..పతంజలిపై ధర్మాసనం సీరియస్ అయింది.



Next Story

Most Viewed