Supreme court: కుల రాజకీయాలు దేశానికి ప్రమాదం.. సుప్రీంకోర్టు

by B.Srinivas |

కులపరమైన అంశాలను ఆధారంగా చేసుకుని రాజకీయాలు చేసే పొలిటికల్ పార్టీలు దేశానికి ప్రమాదకరమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.

Supreme court: కుల రాజకీయాలు దేశానికి ప్రమాదం.. సుప్రీంకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: కులపరమైన అంశాలను ఆధారంగా చేసుకుని రాజకీయాలు చేసే పొలిటికల్ పార్టీలు దేశానికి ప్రమాదకరమని సుప్రీంకోర్టు (Supreme court) వ్యాఖ్యానించింది. ఈ మేరకు ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను స్వీకరించడానికి కోర్టు నిరాకరించింది. మైనారిటీలు సహా సమాజంలోని వెనుకబడిన వర్గాల కోసం పనిచేయడమే ఆ పార్టీ లక్ష్యం అని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్య బాగ్చిలతో కూడిన ధర్మాసనం తెలిపింది. ‘మైనారిటీ సమాజం సహా వెనుకబడిన ప్రతి వర్గం కోసం తాము పని చేస్తామని పార్టీ చెబుతోంది. అందులో మైనారిటీ వర్గాలకు చెందిన వారు, ఆర్థికంగా, విద్యా రంగంలో వెనుకబడిన ముస్లింలు ఉన్నారు. రాజ్యాంగ సూత్రం ప్రకారం ఇది ఆమోదయోగ్యమే. రాజ్యాంగం మైనారిటీలకు కొన్ని హక్కులను ఇచ్చింది. పార్టీ రాజకీయ మ్యానిఫెస్టో లేదా రాజ్యాంగం ఆ హక్కులను పరిరక్షిస్తుందని చెబుతోంది’ అని పిటిషనర్ తరపున న్యాయవాది విష్ణు శంకర్ జైన్‌కు తెలిపింది. ఇస్లామిక్ విద్యను అందించడంలోనూ తప్పు లేదని, దేశంలో మరిన్ని రాజకీయ పార్టీలు విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తే స్వాగతిస్తామని స్పష్టం చేసింది.

ఏఐఎంఐఎం రిజిస్ట్రేషన్, పార్టీ గుర్తింపును సవాలు చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని సూచించింది. దానికి బదులుగా, రాజకీయ పార్టీల సంస్కరణలకు సంబంధించిన సాధారణ అంశాలను లేవనెత్తుతూ సమగ్ర పిటిషన్‌ను దాఖలు చేయాలని కోరింది. కొన్ని రాజకీయ పార్టీలు కులం ఆధారంగా రాజకీయాలు చేస్తాయని, ఇది దేశానికి ఎంతో ప్రమాదకరమని తెలిపింది. సాధారణ పిటిషన్ దాఖలు చేయాలని, దీనిలో ఏ ప్రత్యేక పార్టీని లేదా వ్యక్తిని నిందించకుండా వేయాలని, దానిపై దృష్టి సారిస్తామని తెలిపింది.

Next Story