అధికారం కోసం ప్రజాస్వామ్యాన్ని అణచివేశారు: చండీగఢ్ మేయర్ ఎన్నికపై ప్రియాంకా గాంధీ

by Dishanational2 |
అధికారం కోసం ప్రజాస్వామ్యాన్ని అణచివేశారు: చండీగఢ్ మేయర్ ఎన్నికపై ప్రియాంకా గాంధీ
X

దిశ, నేషనల్ బ్యూరో: చండీగఢ్ మేయర్ ఎన్నిక జరిగిన తీరుపై కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ బీజేపీపై మండిపడ్డారు. అధికారం కోసం నియమ నిబంధనలన్నీ పక్కన బెట్టారని ఆరోపించారు. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని అణచివేసిన తీరు దేశం మొత్తం చూసిందని తెలిపారు. ‘ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం విచ్ఛిన్నమైంది. అధికారం కోసం నిబంధనలు, చట్టం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం అన్నింటినీ పక్కన బెట్టారు. ప్రతిపక్షం గొంతు లేకుండా చేశారు’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ పరిణామాలను దేశ ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనే ఈ స్థాయికి వెళ్ల గలిగితే, రాష్ట్ర, పార్లమెంటు ఎన్నికల్లో ఇంకా ఏ స్థాయికి దిగజారుతారో అనే సందేహం ప్రజల్లో నెలకొందని వెల్లడించారు. గతంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కూడా బీజేపీ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తోందని ఆరోపించారు. కాగా, మంగళవారం జరిగిన చండీగడ్ మేయర్ ఎన్నికల్లో స్పష్టమైన ఆధిక్యం లేనప్పటికీ బీజేపీ అభ్యర్థి విజయం సాధించిన విషయం తెలిసిందే. కాంగ్రెస్, ఆప్ కౌన్సిలర్‌ల ఎనిమిది ఓట్లు చెల్లవని ప్రిసైడింగ్ అధికారి ప్రకటించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఇష్యూపై ఆమ్ ఆద్మీ పార్టీ హైకోర్టులో పిటిషన్ సైతం దాఖలు చేసింది.


Next Story