భారత్ ప్రపంచ గురువుగా, మధ్యవర్తిగా ఉండాలి: ఉక్రెయిన్ మంత్రి

by Disha Web Desk 17 |
భారత్ ప్రపంచ గురువుగా, మధ్యవర్తిగా ఉండాలి: ఉక్రెయిన్ మంత్రి
X

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌కు మద్దతివ్వడమే నిజమైన విశ్వగురువుకు సరైన ఎంపిక అని ఆ దేశ తొలి ఉప విదేశాంగ మంత్రి ఎమైన్ ఝపరోవా అన్నారు. ప్రస్తుతం ఆమె భారత పర్యటనలో ఉన్నారు. ‘ఎంతో మంది ఋషులు, సాధువులు, గురువులకు జన్మనిచ్చిన భారతదేశాన్ని సందర్శించడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు భారతదేశం విశ్వగురువుగా అంటే ప్రపంచ గురువుగా, మధ్యవర్తిగా ఉండాలని కోరుకుంటుంది. మా విషయంలో మాకు చాలా స్పష్టత ఉంది. అమాయక బాధితుడిపై దురాక్రమణ జరిగింది. ఉక్రెయిన్‌కు మద్దతివ్వడమే నిజమైన విశ్వగురువుకు సరైన ఎంపిక’ అని ట్విట్టర్‌లో ఆమె పేర్కొన్నారు.

నాలుగు రోజుల భారత పర్యటనలో ఆమె విదేశాంగ శాఖ కార్యదర్శి సంజయ్ వర్మతో చర్చలు జరుపుతారు. ఈ సందర్భంగా ఇరు పక్షాల ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ఉక్రెయిన్‌లో, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పరిస్థితులపై తమ అభిప్రాయాలను పంచుకుంటారు. గతేడాది రష్యా, ఉక్రెయిన్ వివాదం మొదలైన తర్వాత తూర్పు యూరప్ దేశ ప్రతినిధి అధికారికంగా భారత్ పర్యటనకు రావడం ఇదే తొలిసారి.

అయితే విదేశాంగ వ్యవహారాలు, సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖినితో, డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ విక్రమ్ మిస్రీతో ఝపరోవా సమావేశమవుతారని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. రష్యా-ఉక్రెయిన్ వివాదం చర్చలు, దౌత్యం ద్వారా మాత్రమే పరిష్కారమవుతుందని.. ఎటువంటి శాంతి ప్రయత్నాలకైనా భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పటికీ అభిప్రాయపడుతున్నారు. వివాదం ప్రారంభమైనప్పటి నుంచి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మోడీ చాలాసార్లు మాట్లాడారు.


Next Story

Most Viewed