సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్ లక్ష్యంగా పార్టీ బలోపేతం: నితిన్ నబిన్ ప్రతిజ్ఞ

by Malleboina Mahesh |

బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బీహార్ మంత్రి నితిన్ నబిన్ ను ప్రకటించిన విషయం తెలిసిందే.

సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్ లక్ష్యంగా పార్టీ బలోపేతం: నితిన్ నబిన్ ప్రతిజ్ఞ
X

దిశ, వెబ్ డెస్క్: బీజేపీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా బీహార్ మంత్రి నితిన్ నబిన్ (Bihar Minister Nitin Nabin) ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఢిల్లీలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ అగ్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ ముఖ్యమైన బాధ్యతను అప్పగించినందుకు, తనపై విశ్వాసం ఉంచినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురించి మాట్లాడుతూ, ఆయన నుంచి తాను నిరంతరం నేర్చుకుంటున్నానని, షా తమకు ఒక సంరక్షకుడిలా మార్గనిర్దేశం చేశారని, ఆయన ద్వారానే తాము అభివృద్ధి చెందామని పేర్కొన్నారు. అలాగే, తనకు మద్దతు ఇచ్చిన పార్లమెంటరీ బోర్డు సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కీలక పదవిలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని నితిన్ నబిన్ హామీ ఇచ్చారు.

పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేసిన నితిన్ నబిన్, రాబోయే రోజుల్లో తన కార్యాచరణను వివరించారు. పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానని, ఈ బలోపేతం అనేది బూత్ స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. 'సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్' (అందరి సహకారం, అందరి అభివృద్ధి) అనే నినాదంతో బీజేపీని బలోపేతం చేయడానికి నిబద్ధతతో పని చేస్తామని ఆయన ప్రతిజ్ఞ చేశారు. బీహార్ రాజకీయాల్లో బలమైన నాయకుడిగా ఉన్న నితిన్ నబిన్ ఇప్పుడు జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు చేపట్టడం, రాబోయే ఎన్నికల వ్యూహ రచనలో ఆయన పాత్రకు ప్రాధాన్యత కల్పించనుంది.

Next Story