రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర.. సోనియాగాంధీ సంచలన ఆరోపణలు

by Dishanational4 |
రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర.. సోనియాగాంధీ సంచలన ఆరోపణలు
X

దిశ, నేషనల్ బ్యూరో : కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కారుపై కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ విరుచుకుపడ్డారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని.. రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరుగుతోందని ఆమె ఆరోపించారు. దేశ ప్రజాస్వామ్యాన్ని మోడీ నాశనం చేశారని ధ్వజమెత్తారు. శనివారం రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభ వేదికగా సోనియాగాంధీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంకాగాంధీ సహా ముఖ్య నేతలంతా కలిసి పార్టీ మేనిఫెస్టో ‘న్యాయ్ పత్ర’ను విడుదల చేశారు. ఈసందర్భంగా సోనియా ప్రసంగిస్తూ బీజేపీపై ధ్వజమెత్తారు. లోక్‌సభ ఎన్నికల్లో సొంతంగా 370 సీట్లు గెలుచుకునేందుకు బీజేపీలో చేరాల్సిందిగా విపక్ష నేతలను బెదిరిస్తున్నారని ఆక్షేపించారు. ప్రతిపక్ష నేతలు బీజేపీలో చేరేలా ఒత్తిడి తీసుకొచ్చేందుకు మోడీ సేన రకరకాల కుట్రలను పన్నుతోందన్నారు. గత పదేళ్లలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, అసమానతలను పెంచి పోషించే విషయంలో ఏ అవకాశాన్ని కూడా కేంద్ర సర్కారు విడిచిపెట్టలేదని ఎద్దేవా చేశారు. ‘‘తనను తాను గొప్పగా భావించుకుంటున్న మోడీ.. దేశ గౌరవాన్ని మంటగలుపుతున్నారు. నియంతృత్వ పాలనకు దేశ ప్రజలు సరైన సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చింది’’ అని సోనియాగాంధీ వ్యాఖ్యానించారు.

చైనా దురాక్రమణలపై మోడీ స్పందించడం లేదు : ఖర్గే

దేశ సరిహద్దుల్లో చైనా దురాక్రమణలకు తెగబడుతున్నా ప్రధాని మోడీ స్పందించడం లేదని కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని ప్రధాని మోడీని ఆయన డిమాండ్‌ చేశారు. ‘‘రాజస్థాన్‌లోని చురూలో జరిగిన ప్రధాని మోడీ సభకు రైతులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. అయితే రైతులకు కూడా ఆర్టికల్‌ 370 గురించి ప్రధాని వివరించారు. రైతులకు ఏం చేశారనేది మాత్రం చెప్పలేకపోయారు’’ అని ఎద్దేవా చేశారు.

దేశ ప్రజల వాణి ‘న్యాయ్ పత్ర’ : ప్రియాంకాగాంధీ

ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశ ప్రజలు న్యాయం కోరుతున్నారని.. అందుకే తమ మేనిఫెస్టోకు ‘న్యాయ్ పత్ర’ అనే పేరును పెట్టామని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకగాంధీ చెప్పారు. కేంద్రంలో పేదలు, రైతుల మాటలను పట్టించుకునేవారే కరువయ్యారని తెలిపారు. రాజకీయ కక్షపూరిత వైఖరితో ప్రతిపక్షాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌లను ఈడీ అరెస్టు చేయడాన్ని ఈసందర్భంగా ప్రియాంక గుర్తు చేశారు. దేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ నిరుద్యోగం, ద్రవ్యోల్బణం పతాక స్థాయికి చేరుకున్నాయని తెలిపారు. రైతులు, పేదల గోడు వినే నాథుడే లేకుండా పోయాడని ఆక్షేపించారు. ‘న్యాయ్ పత్ర’ అనేది ఎంతమాత్రం ఎన్నికల తర్వాత మరిచిపోయే ప్రకటనల జాబితా కాదని.. న్యాయం కావాలని కోరుకుంటున్న దేశప్రజల వాణి అని ఆమె అభివర్ణించారు.

రైతుల కోసం.. రాజ్యాంగం కోసం కాంగ్రెసే గెలవాలి : సచిన్ పైలట్

ఈసారి ఎన్నికలు ఎంతో నిర్ణయాత్మకమైనవని కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ పైలట్ అన్నారు. రెండు సిద్ధాంతాల మధ్య జరుగుతున్న పోరాటమే ఈ ఎన్నికలని చెప్పారు. రాజ్యాంగాన్ని బలహీనపరచడమే కేంద్ర ప్రభుత్వ విధానమన్నారు. రైతుల సంక్షేమం కావాలన్నా.. రాజ్యాంగ పరిరక్షణ జరగాలన్నా కాంగ్రెస్ పార్టీని బలపర్చాలని దేశ ప్రజలను ఆయన కోరారు.

Next Story

Most Viewed