ఢిల్లీని కమ్మేసిన పొగమంచు: హెచ్చరికలు జారీ చేసిన అధికారులు

by Dishanational2 |
ఢిల్లీని కమ్మేసిన పొగమంచు: హెచ్చరికలు జారీ చేసిన అధికారులు
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాలను దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీంతో 50కి పైగా విమానాలు ఆలస్యమైనట్టు ఢిల్లీ విమానాశ్రయ అధికారులు తెలిపారు. వీటిలో కొన్నింటిని జైపూర్, అహ్మదాబాద్, ముంబైలకు మళ్లించినట్టు వెల్లడించారు. తెల్లవారుజామున 1:30 గంటల నుండి ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో జీరో విజిబిలిటీ ఉన్నట్టు తెలిపపారు. తాజా విమాన సమాచారం కోసం ప్రయాణికులు తమ విమానయాన సంస్థలను సంప్రదించాలని సూచించారు. 23 రైళ్లు సైతం ఆలస్యంగా నడుస్తున్నాయని రైల్వే అధికారులు తెలిపారు. మరోవైపు, జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్‌లలో రానున్న రెండు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో ఢిల్లీలోనూ వాతావరణ పరిస్థితులు మారే చాన్స్ ఉందని పేర్కొన్నారు.

13ఏళ్లలో ఇదే అత్యల్పం

జనవరి 1 నుంచి 30 వరకు ఢిల్లీలో సగటు గరిష్ట ఉష్ణోగ్రత 17.7 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైనట్టు వాతావరణ అధికారులు వెల్లడించారు. 2011 నుంచి అత్యల్పంగా నమోదు కావడం ఇదే మొదటి సారి కావడం గమనార్హం. మంగళవారం ఢిల్లీలో గరిష్టంగా 21.4 డిగ్రీల సెల్సియస్, 8.7 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పంజాబ్, హర్యానా, చండీగఢ్ మరియు ఢిల్లీతో సహా కొన్ని ప్రాంతాల్లో బుధవారం గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. ఈ నేపథ్యంలో ఆరోగ్యాధికారులు పలు హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, సూచించారు. ఆస్తమా, బ్రాంకైటిస్‌ వ్యాధులతో బాధపడే వారు దట్టమైన పొగమంచులో ఎక్కువ సేపు ఉండకుండా చూసుకోవాలని, దీంతో శ్వాసకోశ సమస్యలు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.


Next Story

Most Viewed