మళ్లీ నడక నేర్చుకుంటున్న శుభాంశు శుక్లా.. వీడియో వైరల్

by Yella Dhawani Reddy |

భారత అంతరిక్ష చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) ప్రస్తుతం భూమి మీద మరో ప్రయోగాన్ని చేస్తున్నారు

మళ్లీ నడక నేర్చుకుంటున్న శుభాంశు శుక్లా.. వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: భారత అంతరిక్ష చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) ప్రస్తుతం భూమి మీద మరో ప్రయోగాన్ని చేస్తున్నారు. అదే మళ్లీ నడక నేర్చుకోవటం! ఇటీవల విజయవంతంగా ముగిసిన యాక్సియం-4 (Axiom-4) మిషన్ అనంతరం ఆయన ప్రస్తుతం క్వారంటైన్ సెంటర్‌లో వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అంతరిక్షంలో మైక్రోగ్రావిటీని అనుభవించిన శుక్లా, భూ వాతావరణానికి మళ్లీ శరీరాన్ని సరిపోచేసుకునేందుకు పలు చర్యలు చేపట్టుతున్నారు. నడక నేర్చుకోవటం, పరుగులు మొదలైన వ్యాయామాలను చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలను శుక్లా తన సోషల్ మీడియాలో షేర్ చేయగా, వైరల్‌గా మారాయి.

అంతరిక్షంలో మైక్రోగ్రావిటీ కారణంగా శరీరంలో పలు మార్పులు వస్తాయని శుక్లా ఈ సందర్భంగా తెలిపారు. 'గుండె స్పందన రేటు, కండరాల స్థితి, శరీర సమతౌల్యం వంటి అంశాలపై దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. భూమికి వచ్చిన తర్వాత గురుత్వాకర్షణ శక్తికి మళ్లీ అలవాటుపడటానికి కొంత సమయం పడుతుంది' అని పేర్కొన్నారు. అలాగే, శుక్లా తమ ఆరోగ్యాన్ని గురించి ఆరా తీసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

ప్రస్తుతం ఆయనతో పాటు యాక్సియం-4 మిషన్‌లో పాల్గొన్న ఇతర వ్యోమగాములు.. పెగ్గీ విట్సన్, స్లావోస్జ్ ఉజ్నాన్స్‌కీ-విస్నియెస్కీ, టిబర్ కపులు కూడా క్వారంటైన్‌లో ఉన్నారు. వీరి ఆరోగ్యాన్ని ఇస్రో వైద్యాధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. బుధవారం నాటికి వారి క్వారంటైన్ ముగియనుంది. కాగా, ఇటీవల నిర్వహించిన యాక్సియం-4 మిషన్‌లో శుభాంశు శుక్లా బృందం 18 రోజుల పాటు అంతరిక్షంలో గడిపి, పలు శాస్త్రీయ ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించింది. జులై 15న వారు భూమికి విజయవంతంగా తిరిగివచ్చారు.

Next Story