రాజస్థాన్‌లో కాంగ్రెస్‌కు షాక్: బీజేపీలో చేరిన సీనియర్ నేత

by Dishanational2 |
రాజస్థాన్‌లో కాంగ్రెస్‌కు షాక్: బీజేపీలో చేరిన సీనియర్ నేత
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా నామినేషల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాజస్థాన్‌లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఉత్కంఠ రేపుతున్నాయి. సోమవారం కాంగ్రెస్ సీనియర్ నేత, నాలుగు సార్లు హస్తం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికైన మహేంద్రజీత్ సింగ్ మాల్వియా సోమవారం బీజేపీలో చేరారు. రాజస్థాన్ బీజేపీ ఇన్‌చార్జ్ అరుణ్ సింగ్, రాష్ట్ర యూనిట్ చీఫ్ సీపీ జోషిల ఆధ్వర్యంలో ఆయన కాషాయ పార్టీలో చేరారు. బీజేపీ జాతీయ సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రసంగం తనను ప్రభావితం చేసిందని మహేంద్రజీత్ సింగ్ తెలిపారు. గిరిజన ప్రాంతంలో బీజేపీ, మోడీ తప్ప మరెవరూ అభివృద్ధి చేయలేదని తెలిపారు. మోడీ విధానాలకు ఆకర్షితులై బీజేపీలో చేరినట్టు స్పష్టం చేశారు. అయితే మాలవ్య బాటలోనే మరికొంత మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇతర నేతలు ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. వీరంతా బీజేపీలో చేరడానికి ఇప్పటికే ఢిల్లీ వెళ్లినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. సుమారు 12మంది ఎమ్మెల్యేలు కాషాయ పార్టీలో చేరనున్నట్టు ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే సోనియా నామినేషన్ వేసిన మరుసటి రోజు నుంచే ఈ పరిణామాలు చోటు చేసుకుంటుండటం గమనార్హం.



Next Story

Most Viewed