బీఎస్పీకి షాక్: పార్టీకి సీనియర్ నేత రాజీనామా

by Dishanational2 |
బీఎస్పీకి షాక్: పార్టీకి సీనియర్ నేత రాజీనామా
X

దిశ, నేషనల్ బ్యూరో: త్వరలో పార్లమెంటు ఎన్నికలు జరగనున్న వేళ బహుజన్ సమాజ్ వాదీ పార్టీ(బీఎస్పీ)కి షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ రితేష్ పాండే ఆదివారం పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు బీఎస్పీ చీఫ్ మాయవతికి లేఖ రాశారు. ‘బీఎస్పీ నుంచి నేను రాజకీయ జీవితం ప్రారంభించారు. కానీ చాలా కాలంగా పార్టీ సమావేశాలకు, కార్యక్రమాలకు నన్ను పిలవలేదు. పార్టీ నాయకత్వం కూడా నాతో మాట్లాడలేదు. పార్టీ అగ్ర నాయకత్వాన్ని కలవడానికి అనేక ప్రయత్నాలు చేసాను, కానీ అది ఎటువంటి ఫలితాన్ని ఇవ్వలేదు. అందుకే పార్టీకి నా సేవలు అవసరం లేదనే నిర్ణయానికి వచ్చాను. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీకి రిజైన్ చేయడం తప్ప వేరే మార్గం లేదు. ఇది చాలా కష్టమైన డిసిషన్, అయినప్పటికీ తప్పడం లేదు’ అని లేఖలో పేర్కొన్నారు.

కాసేపట్లోనే బీజేపీలో చేరిక

రాజీనామా చేసిన కొద్ది గంటల్లోనే రితేష్ బీజేపీలో చేరారు. బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీజేపీ యూపీ ఇన్‌చార్జ్ బైజయంత్, రాష్ట్ర అధ్యక్షుడు భూపేంద్ర చౌదరి, డిప్యూటీ సీఎం బ్రిజేష్ పాఠక్‌ల ఆధ్వర్యంలో ఆయన కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. అనంతరం రితేష్ మీడియాతో మాట్లాడుతూ..మోడీ వల్లే దేశం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. మోడీ నుంచి స్పూర్తి పొందానని అందుకే బీజేపీలో చేరినట్టు వెల్లడించారు. కాగా, రితేష్ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అతని తండ్రి రాకేష్ పాండే ఎస్పీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం రితేష్ ప్రాతినిథ్యం వహిస్తున్న స్థానం నుంచేచి మళ్లీ ఆయనను పోటీకి దింపేందుకు బీజేపీ ఒప్పుకున్నట్టు సమాచారం. కాగా, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా పార్లమెంట్ హౌస్ క్యాంటీన్‌లో మోడీతో భోజనం చేసిన 9 మంది ఎంపీల్లో రితేష్ పాండే కూడా ఉన్నారు.



Next Story