ఉద్ధవ్‌కు సుప్రీంలో ఎదురుదెబ్బ.. స్టే విధించేందుకు నిరాకరణ

by Disha Web Desk 13 |
ఉద్ధవ్‌కు సుప్రీంలో ఎదురుదెబ్బ.. స్టే విధించేందుకు నిరాకరణ
X

న్యూఢిల్లీ: మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ థాక్రేకు సుప్రీంకోర్టులోనూ ఎదురుదెబ్బ తగిలింది. శివసేన పార్టీని, దాని గుర్తును సీఎం షిండే వర్గానికే అప్పగిస్తూ ఎన్నికల కమిషన్(ఈసీ) ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈసీ ముందు మెజార్టీని నిరూపించుకోవడంలో షిండే వర్గం విజయం సాధించిందని, కాబట్టి, ఈసీ ఆదేశాలపై స్టే విధించలేమని సీజైఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే, ఉద్ధవ్ వర్గం 'శివసేన(బాలసాహెబ్ థాక్రే)' పార్టీ, కాగడ గుర్తును వాడుకోవచ్చని వెల్లడించింది. కాగా, రెండుగా చీలిన శివసేనను, మెజార్టీ ఎక్కువగా ఉండటంతో షిండే వర్గానికే కేటాయిస్తున్నటు ఈ నెల 17న ఎన్నికల ఈసీ ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే.

దీన్ని ఉద్ధవ్ వర్గం సుప్రీంకోర్టులో సవాల్ చేయగా, మంగళవారం విచారణ జరిపింది. ఈ క్రమంలోనే ఈసీ ఆదేశాలపై స్టే విధించేందుకు ధర్మాసనం నిరాకరించింది. ఉద్ధవ్ తరఫున సీనియర్ అడ్వకేట్ కపిల్ సిబల్ తన వాదనలు వినిపించారు. పార్టీ కార్యాలయాలు, బ్యాంకు ఖాతాలను షిండే గ్రూపు స్వాధీనం చేసుకుంటోందని పేర్కొంటూ స్టేటస్ కో ఆర్డర్‌ను కోరగా, ధర్మాసనం దానినీ తిరస్కరించింది. ఈసీ ఇచ్చిన ఆదేశాల్లో పార్టీ, దాని గుర్తుకు సంబంధించిన అంశాలు మాత్రమే ఉన్నాయని, బ్యాంకు ఖాతాలు, ఆస్తుల గురించి లేదని తెలిపింది. కాబట్టి, ఈసీ ఆదేశాల్లో లేని చర్యలకు పాల్పడితే, చట్ట ప్రకారం ముందుకెళ్లాలని సూచించింది. మరోవైపు, ఈసీ నోటిఫికేషన్‌పై సుప్రీంకోర్టు షిండే వర్గానికి, ఈసీకి నోటీసులు జారీ చేసింది. రెండువారాల్లోగా కౌంటర్ దాఖలు ఆదేశించింది. వారంలోగా రిజాయిండర్ ఇవ్వాలని నిర్దేశించింది.

Next Story