త్వరలోనే నిజాలు బయటపడతాయ్: అజిత్ పవార్ తిరుగుబాటుపై శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 19 |
త్వరలోనే నిజాలు బయటపడతాయ్: అజిత్ పవార్ తిరుగుబాటుపై శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర రాజకీయాల్లో ఆదివారం ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రేపై తిరుగుబాటు చేసి కొందరు ఎమ్మెల్యేలతో వెళ్లి ఏక్ నాథ్ షిండే బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా.. సరిగ్గా ఏడాదికి మహారాష్ట్రలో కీలకమైన ఎన్సీపీలో అదే రకమైన తిరుగుబాటు జరిగింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేత అయిన అజిత్ పవార్ శరద్ పవార్‌పై తిరుగుబావుటా ఎగరేసి షిండే ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. ఆదివారం కొందరు ఎన్సీపీ ఎమ్మెల్యేలతో కలిసి షిండే ప్రభుత్వంలో చేరిన అజిత్ పవార్.. అదే రోజు మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ప్రమాణం స్వీకారం చేశారు. రాజ్ భవన్‌కు వెళ్లడం.. గవర్నర్‌ను కలవడం.. శిండే ప్రభుత్వానికి మద్దతు తెలపడం.. డిప్యూటీ సీఎంగా పవార్ ప్రమాణ స్వీకారం చేయడం కొన్ని గంటల్లోనే జరిగిపోవడం మహా రాజకీయాల్లో సంచలనంగా మారింది.

ఇదిలా ఉండగా.. అజిత్ పవార్ తిరుగుబాటుపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పందించారు. ఎన్సీపీ ఎమ్మెల్యేలతో కలిసి అజిత్ పవార్ శిండే ప్రభుత్వంలో చేరిపోవడంతో శరద్ పవార్ అప్రమత్తమయ్యారు. వెంటనే నష్టనివారణ చర్యలకు దిగారు. ఇందులో భాగంగా శరద్ పవార్ ఇవాళ ఎన్సీపీ పార్టీ సమావేశానికి పిలుపునిచ్చారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ ప్రతినిధులు అందరూ ఈ సమావేశానికి హాజరుకావాలని ఆదేశించారు. ఈ సందర్భంగా శరద్ పవార్ మాట్లాడుతూ.. కొందరు తామే నిజమైన ఎన్సీపీ నేతలుగా చెప్పుకుంటున్నారని.. కానీ త్వరలోనే నిజం బయటకు వస్తుందని అన్నారు. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని మళ్లీ పునర్నిర్మిస్తామన్నారు. సీనియర్ నేత ప్రఫుల్ పటేల్ వైఖరితో కలత చెందానని పవార్ ఆవేదన వ్యక్తం చేశారు.



Next Story