పార్టీ స్థాపించిన వారినే తొలగిస్తారా: ఈసీ నిర్ణయంపై శరద్ పవార్ స్పందన

by Dishanational2 |
పార్టీ స్థాపించిన వారినే తొలగిస్తారా: ఈసీ నిర్ణయంపై శరద్ పవార్ స్పందన
X

దిశ, నేషనల్ బ్యూరో: నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) పార్టీ పేరు, గుర్తును మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌కు కేటాయిస్తూ ఎలక్షన్ కమిషన్ తీసుకున్న నిర్ణయంపై ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ స్పందించారు. రాజకీయ పార్టీని స్థాపించిన వారినే పార్టీ నుంచి తొలగిస్తారా అని ప్రశ్నించారు. ఇటువంటివి గతంలో ఎన్నడూ జరగలేదని తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈసీ తీసుకున్న నిర్ణయం చట్టవిరుద్ధమని చెప్పారు. ఈసీ ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్ చేసినట్టు వెల్లడించారు. ప్రజాస్వామ్యంలో ఈ తరహా ఘటనలు జరగడం బాధాకరమన్నారు. ఎన్‌సీపీ పేరు, గుర్తును కోల్పోవడం గురించి తాను ఆందోళన చెందడం లేదని, వేరే మార్గంలో వెళ్లడానికి ఎంచుకున్న వారిని ప్రజలు ఆమోదించలేరని స్పష్టం చేశారు. అంతకుముందు ఓ బహిరంగ సభలో శరద్ మాట్లాడుతూ.. అధికారం వస్తుంది పోతుంది, అయితే భావజాలం, విధానాలు, దేశాన్ని ముందుకు తీసుకెళ్లే ఆలోచనలే శాశ్వతమని అన్నారు. కాగా, అజిత్ పవార్ వర్గమే నిజమైన ఎన్సీపీ అని ఈసీ చెప్పిన విషయం తెలిసిందే.

బారామతి సెగ్మెంట్‌పై ఉత్కంఠ

మహారాష్ట్రలోని బారామతి పార్లమెంటు నియోజకవర్గం శరద్ పవార్ కుటుంబానికి కంచుకోటగా ఉంది. రాబోయే ఎన్నికల్లో ఇక్కడ హోరా హోరీ పోరు ఉండనున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే అజిత్ భార్య సునేత్రను ఇక్కడ నుంచి బరిలోకి దించనున్నట్టు వెల్లడించారు. శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే ప్రస్తుతం బారామతి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర పోటీ ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పరిణామాలపై సుప్రీయా స్పందిస్తూ.. ‘ భారత్ ప్రజాస్వామ్యం దేశం. ఇక్కడ ప్రతి ఒక్కరికీ ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉంది’ అని చెప్పారు.


Next Story