- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Tornado: అమెరికాలో టోర్నడో బీభత్సం.. 21 మంది మృతి
అమెరికాలో టోర్నడో బీభత్సం సృష్టించింది. ఈ టోర్నడోలో 21 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. ఒక్క కెంటకీలోనే 14 మంది మరణించగా మిస్సోరీలో మరో ఏడుగురు మృతి చెందారు.

దిశ, వెబ్డెస్క్: సెంట్రల్ యునైటెడ్ స్టేట్స్లోని మిస్సౌరీ, కెంటకీ రాష్ట్రాల్లో తీవ్రమైన తుఫానులు, టోర్నడోలు సంభవించడంతో 21 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. కెంటకీలో 14 మంది మరణించినట్లు గవర్నర్ ఆండీ బెషీర్ ప్రకటించారు. లారెల్ కౌంటీలో శుక్రవారం రాత్రి 11:49 గంటలకు టొర్నడో సంభవించినట్లు షెరీఫ్ విభాగం తెలిపింది. దీంతో అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. రెస్క్యూ బృందాలు బాధితుల కోసం గాలింపు కొనసాగిస్తుండగా, మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని బెషీర్ పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గురువారం ఎమర్జెన్సీ ప్రకటించిన బెషీర్, ఐదు కౌంటీలు స్థానికంగా ఎమర్జెన్సీని ప్రకటించాయని, విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో లక్షమందికి పైగా ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.
మిస్సౌరీలో, సెయింట్ లూయిస్లో శుక్రవారం తుఫాను బీభత్సం సృష్టించడంతో ఐదుగురు మరణించారు. నేషనల్ వెదర్ సర్వీస్ టొర్నడోను ధృవీకరించకపోయినా, రాడార్ చిత్రాలు ఒక టోర్నడో సంభవించినట్లు సూచిస్తున్నాయి. సెయింట్ లూయిస్ ఫైర్ చీఫ్ డెన్నిస్ జెంకర్సన్ ప్రకారం.. ఈ తుఫాను రద్దీగా ఉండే రహదారిపై మొదలై.. నగరంలో 20 చదరపు బ్లాక్ల ప్రాంతంలో విధ్వంసం సృష్టించింది. 5,000 కంటే ఎక్కువ ఇళ్లు దెబ్బతిన్నాయని మేయర్ కారా స్పెన్సర్ తెలిపారు. స్కాట్ కౌంటీలో, షెరీఫ్ డెరిక్ వీట్లీ ప్రకారం.. శుక్రవారం టోర్నడో గ్రామీణ ప్రాంతాలను తాకడంతో ఇద్దరు మరణించారు. అనేక ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
ఈ తుఫానులు గురువారం నుంచి శనివారం వరకు 24 రాష్ట్రాల్లో 1,500కు పైగా తీవ్ర వాతావరణ నివేదికలను రికార్డు చేశాయి. కెంటకీ, టెన్నెస్సీలలో వరదల ముప్పు (లెవెల్ 2/4) ఉందని నేషనల్ వెదర్ సర్వీస్ హెచ్చరించింది. ఆదివారం నాటికి ప్లెయిన్స్ ప్రాంతంలో మరింత తీవ్ర టొర్నడోలు రావచ్చని అంచనా వేస్తున్నారు. ఈశాన్య టెక్సాస్ నుంచి మిడ్-అట్లాంటిక్ వరకు 1,200 మైళ్ల విస్తీర్ణంలో తీవ్ర వాతావరణం కొనసాగుతుందని హెచ్చరికలు జారీ అయ్యాయి.






