మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ.. ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవం

by Kema Shiva Kumar |

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు భారీ షాక్ తగిలింది.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణతో ముగ్గురు బీజేపీ అభ్యర్థులు రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ.. ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవం
X

దిశ, వెబ్‌డెస్క్: మధ్యప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. రాజ్యసభ ఎన్నికల వేళ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కోర్టు కేసుల సాంకేతిక కారణాలను చూపుతూ.. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జ్, సీనియర్ నేత మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. ఈ పరిణామంతో మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఇద్దరికి బదులుగా ముగ్గురు బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా (Unopposed) ఎన్నికైనట్లుగా ఈసీ ప్రకటించింది. అందులో తరుణ్ చుగ్, రజనీశ్ అగర్వాల్, మహేశ్ ఉన్నారు. సంఖ్యాబలం ప్రకారం దక్కాల్సిన సీటును చేజార్చుకోవడంతో కాంగ్రెస్ శ్రేణులు నైరాశ్యంలో ఉన్నాయి.

రేపు రాష్ట్రపతి‌తో కాంగ్రెస్ ఎమ్మెల్యేల భేటీ

ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. తమకు జరిగిన అన్యాయాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా, రేపు 62 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలవనున్నారు. ఇందుకోసం వారు ఇప్పటికే రాష్ట్రపతి భవన్ నుంచి ముందస్తు అపాయింట్‌మెంట్ తీసుకున్నారు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వెనుక జరిగిన పరిణామాలను, ప్రజాస్వామ్య ఉల్లంఘనలను వివరిస్తూ రాష్ట్రపతికి వారు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయనున్నారు. మరోవైపు ఈ వ్యవహారంపై అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) ఇప్పటికే న్యాయపోరాటానికి దిగింది. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణను సవాల్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్‌ను పరిశీలించిన అత్యున్నత ధర్మాసనం (Supreme Court) విచారణకు స్వీకరించింది.

Next Story