వీవీప్యాట్లపై పిటిషన్‌ను వచ్చే వారం విచారణ జరుపుతామన్న సుప్రీంకోర్టు

by Dishanational1 |
వీవీప్యాట్లపై పిటిషన్‌ను వచ్చే వారం విచారణ జరుపుతామన్న సుప్రీంకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: వీవీప్యాట్ మిషన్‌లలో పోలైన ఓట్లను క్రాస్ వెరిఫికేషన్ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను వచ్చే వారం విచారించనున్నట్టు సుప్రీంకోర్టు పేర్కొంది. ఏడీఆర్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను వచ్చే మంగళవారం లేదా బుధవారం లిస్టింగ్ చేస్తామని జస్టిస్ సంజీవ్ ఖన్నాతో కూడిన ధర్మాసనం తెలిపింది. పిటిషనర్ ఏడీఆర్ తరపున ప్రశాంత్ భూషణ్ ఈ అంశాన్ని అత్యవసరంగా విచారించాలని కోరారు. ఈ కేసులో సీనియర్‌ న్యాయవాది గోపాల్‌ శంకరనారాయణన్‌ కూడా వాదనలు వినిపిస్తూ, ఎన్నికలు సమీపిస్తున్నాయని, కేసు విచారణకు రాకుంటే పిటిషన్‌ నిష్ఫలమవుతుందని వాదించారు. వీవీప్యాట్‌లపై దాఖలైన మరో పిటిషన్‌పై స్పందన కోరుతూ ఎన్నికల సంఘం, కేంద్ర ప్రభుత్వానికి అత్యున్నత న్యాయస్థానం నోటీసులిచ్చింది. జస్టిస్ ఎంఎం సుందరేష్, బేల ఎం త్రివేదితో పాటు జస్టిస్ ఖన్నాతో కూడిన ప్రత్యేక బెంచ్‌ పరిస్థితి తమకు తెలుసునని, వచ్చే వారం విచారణ జరపనున్నట్టు వెల్లడించారు. ఏడీఆర్ పిటిషన్‌పై గతేడాది జూలై 17న సుప్రీంకోర్టు ఎన్నికల స్పందనను కోరింది. ఓటర్లు వేసిన ఓటును వీవీప్యాట్ మిషన్ ద్వారా నిర్ధారించుకునేలా ఎన్నికాల సంఘం, కేంద్రాన్ని ఆదేఇంచాలని ఏడీఆర్ తన పిటిషన్‌లో విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం ఎంపిక చేసిన ఐదు ఈవీఎంలకు చెందిన వీవీప్యాట్ స్లిప్‌లను ధృవీకరించే విధానం కొనసాగుతోంది.

Next Story

Most Viewed