అదానీ కేసు విచారణపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 17 |
అదానీ కేసు విచారణపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ కీలక వ్యాఖ్యలు
X

న్యూఢిల్లీ: అదానీ అంశంలో అన్ని కోణాలను విచారించే అధికార పరిధి సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీకి లేదని.. ఇది ప్రభుత్వానికి ‘క్లీన్ చిట్’ ప్యానెల్ మాత్రమేనని కాంగ్రెస్ బుధవారం ఆరోపించింది. జేపీసీ దర్యాప్తు మాత్రమే వాస్తవాలను బయటకు తీసుకురాగలదని పేర్కొంది. ‘హమ్ అదానీ కే హై కౌన్’ కార్యక్రమం కింద కాంగ్రెస్ పార్టీ అడిగిన ప్రశ్నల మొత్తం 100 మార్క్‌కు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ మాట్లాడుతూ.. అదానీ సమస్యపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) దర్యాప్తు చేయాలని మరోసారి డిమాండ్ చేశారు.

యూఎస్‌కు చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ అదానీ గ్రూప్ మోసపూరిత లావాదేవీలు, షేర్ ధరల తారుమారు చేసిందని ఆరోపించింది. దాని తర్వాత స్టాక్ మార్కెట్‌లో అదానీ గ్రూప్ షేర్ ధరలు పడిపోయి తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ పరిణామాల నేపథ్యంలో అదానీపై వచ్చిన ఆరోపణలపై జేపీసీతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ పట్టుబట్టింది. అయితే ఈ ఆరోపణలను గౌతమ్ అదానీ నేతృత్వంలోని గ్రూప్ కొట్టిపారేసింది. తమ సంస్థ చట్టాలకు అనుగుణంగా వ్యవహరిస్తోందని చెప్పింది.

అదానీ విషయంలో ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ఇప్పటి వరకు ప్రధాని మోడీకి 99 ప్రశ్నలు వేశామని రమేష్ చెప్పారు. ఇక చివరిగా మరో ప్రశ్న అడుగుతున్నాం.. అతను దర్యాప్తు సంస్థల విస్తారమైన సైన్యాన్ని ఉపయోగించి జాతీయ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాడా? అని జైరాం అన్నారు. అదానీ కేసు విచారణ కోసం మార్చి 2న సుప్రీంకోర్టు నియమించిన నిపుణుల కమిటీకి దర్యాప్తు ఏజెన్సీలపై ఎటువంటి అధికారిక పరిధి లేదని ఆయన తెలిపారు.


Next Story