- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ షాక్.. సోషల్ మీడియాలో కొత్త రూల్స్
ప్రభుత్వ ఉద్యోగుల సోషల్ మీడియా వినియోగంపై బీహార్ ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. డ్యూటీలో రీల్స్ చేయడం, కోర్టు తీర్పులపై కామెంట్స్ చేయడం నిషేధించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: సోషల్ మీడియా వినియోగం పెరిగిపోయాక వాస్తవాల కంటే అబద్ధాలే ఎక్కువ వైరల్ అవుతున్నాయి. ఈ ప్రభావం ఒక్కోసారి ప్రభుత్వాలు కంట్రోల్ చేయలేనంత తీవ్రరూపం దాలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉంటూ సోషల్ మీడియాలో (Social Media Rules for Employees) కామెంట్స్ చేసే వారికి బీహార్ ప్రభుత్వం (Bihar Government) గట్టి షాక్ ఇచ్చింది. ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తన నియమావళిలో భారీ మార్పులు చేస్తూ కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చింది. ఇకపై విధుల్లో ఉన్న ఉద్యోగులు సోషల్ మీడియా ఖాతాల్లో వ్యక్తిగత అభిప్రాయాలను పోస్ట్ చేయకూడదని స్పష్టం చేసింది. ఒక వేళ వ్యక్తిగత ఖాతాలు తెరుచుకోవాలని భావిస్తే అందుకు అధికారిక ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్లను వినియోగించకూడదని స్పష్టం చేసింది. ఈ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించింది.
కొత్త నిబంధనలు అమలులోకి..
జనవరి 2026లో బీహార్ ప్రభుత్వం తీసుకొచ్చిన 'ప్రభుత్వ సేవల ప్రవర్తన (సవరణ) నియమావళి, 2026'కు గవర్నర్ ఆమోద ముద్ర వేశారు. శుక్రవారం సాయంత్రం గెజిట్లో ప్రచురితం కావడంతో ఈ నిబంధనలు తక్షణమే అమలులోకి వచ్చాయి. డిజిటల్ యుగంలో ప్రభుత్వ వ్యవస్థల గౌరవాన్ని కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. కొత్త రూల్స్ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు ఆఫీసు ప్రాంగణంలో లేదా డ్యూటీ సమయంలో రీల్స్ చేయడం, వీడియోలు తీయడం లేదా లైవ్ స్ట్రీమింగ్ చేయడం పూర్తిగా నిషేధం. హైకోర్టు లేదా సుప్రీంకోర్టు తీర్పులపై వ్యక్తిగత అభిప్రాయాలను సోషల్ మీడియాలో పంచుకోకూడదు. ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా లేదా వ్యతిరేకంగా పోస్టులు పెట్టకూడదు. వ్యక్తిగత ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఖాతాల కోసం ప్రభుత్వ ఈమెయిల్ ఐడి లేదా మొబైల్ నంబర్లను ఉపయోగించకూడదు. నకిలీ పేర్లతో లేదా గుర్తింపును దాచిపెట్టి సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టకూడదని పేర్కొన్నారు.
పోటీ పరీక్షలపై కీలక మార్పు:
సోషల్ మీడియాతో పాటు పోటీ పరీక్షల విషయంలోనూ ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసింది. గతంలో ప్రభుత్వ ఉద్యోగులు సర్వీసులో ఉండగా ఐదుసార్లు పోటీ పరీక్షలు రాసేందుకు అవకాశం ఉండేది. కానీ కొత్త నిబంధనల ప్రకారం.. తమ మొత్తం సర్వీసు కాలంలో ఒక్కసారి మాత్రమే పోటీ పరీక్ష రాసేందుకు అనుమతి ఉంటుంది. అది కూడా తప్పనిసరిగా 'అభ్యంతర పత్రం' (NOC) సమర్పించాల్సి ఉంటుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో బీహార్లోని ప్రభుత్వ శాఖల్లో ఒక్కసారిగా కలకలం మొదలైంది. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఉద్యోగులు ఇప్పుడు తమ పాత పోస్టులను తొలగించుకునే పనిలో పడ్డారు.






