AAP: రూ.2 వేల కోట్ల స్కామ్‌.. ఆప్‌ నేతలపై ఏసీబీ కేసు

by Shamantha N |

ఆప్ నేతలు మరో కేసులో చిక్కుకున్నారు. ఢిల్లీ మాజీ మంత్రులు, ఆమ్‌ ఆద్మీ పార్టీ ముఖ్య నేతలు మనీశ్‌ సిసోడియా (Manish Sisodia), సత్యేంద్ర జైన్‌ (Satyendar Jain)లపై అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసింది.

AAP: రూ.2 వేల కోట్ల స్కామ్‌.. ఆప్‌ నేతలపై ఏసీబీ కేసు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆప్ నేతలు మరో కేసులో చిక్కుకున్నారు. ఢిల్లీ మాజీ మంత్రులు, ఆమ్‌ ఆద్మీ పార్టీ ముఖ్య నేతలు మనీశ్‌ సిసోడియా (Manish Sisodia), సత్యేంద్ర జైన్‌ (Satyendar Jain)లపై అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసింది. ఆప్‌ ప్రభుత్వ హయాంలో ఢిల్లీలో 12,000 తరగతి గదులు, పాఠశాల భవనాల నిర్మాణంలో రూ. 2 వేల కోట్ల అక్రమాలు జరిగినట్లు (classroom construction scam) వెలుగులోకి వచ్చింది. కాగా.. మనీశ్‌ సిసోడియా, మాజీ మంత్రి జైన్‌లు ఇందులో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఏసీబీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు సిసోడియా, జైన్‌లపై కేసులు నమోదు చేశారు అంతేకాదు ఈ స్కామ్‌లో ప్రభుత్వ అధికారులు, కాంట్రాక్టర్ల పాత్రపై కూడా దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ చీఫ్‌ మధుర్‌ వర్మ తెలిపారు.

అక్రమాలు..

ఆప్‌ ప్రభుత్వ హయాంలో సిసోడియా విద్యాశాఖ మంత్రిగా, సత్యందర్‌ జైన్‌ పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌ (పీడబ్ల్యూడీ) మంత్రిగా ఉన్నారు. వారి నేతృత్వంలో ఢిల్లీలో 12,748 పాఠశాల భవనాలు, తరగతి గదుల నిర్మాణం చేపట్టారు. అయితే, ఇందులో రూ.2వేల కోట్ల అక్రమాలు జరిగాయి. 34 మందికి దీని కాంట్రాక్టులు దక్కాయి. వారిలో చాలామందికి ఆప్‌తో దగ్గర సంబంధాలు ఉన్నట్లు తేలింది. నిర్ణీత గడువులోగా నిర్మాణాలు పూర్తికాకపోగా, భారీగా ఖర్చు చేశారు. తరగతి గదులను 30 సంవత్సరాలకు ఉండేలా కడితే.. వాటికి అయిన ఖర్చు మాత్రం 75ఏళ్లు ఉండేలా అయ్యింది. గడువు ప్రక్రియను పాటించకుండా కన్సల్టెంట్లు, ఆర్కిటెక్ట్‌లను నియమించుకోవడంతో దాదాపు ఐదు రెట్లు వ్యయం పెరిగిపోయింది. ఇటీవల సెట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ (సీవీసీ) ఇచ్చిన నివేదికలో తరగతి గదుల నిర్మాణ ప్రాజెక్టులో అవకతవకలు జరిగాయని పేర్కొంది. కొత్త టెండర్లు తీసుకోకపోవడంతో ఈ ప్రాజెక్టు వ్యయం రూ.326 కోట్లు పెరిగిందని రిపోర్టులో తెలిపింది. దీంతో, సిసోడియా, జైన్ లను విచారించేందుకు మార్చిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలపింది. దీనితో ఆ ఇద్దరిపై కేసు నమోదైంది.

Next Story