ప్రతిపక్షాలూ.. దయచేసి పునరాలోచించండి : నిర్మలా సీతారామన్

by Disha Web Desk 13 |
ప్రతిపక్షాలూ.. దయచేసి పునరాలోచించండి : నిర్మలా సీతారామన్
X

చెన్నై: నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవాన్ని బాయ్ కాట్ చేస్తూ చేసిన ప్రకటనపై ప్రతిపక్షాలు మరోసారి ఆలోచించుకోవాలని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. పార్లమెంట్ అనేది ప్రజాస్వామ్య దేవాలయమని, ప్రజా ప్రయోజనాల కోసమైనా.. తమ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు మార్చుకోవాలని విజ్ఞప్తి చేశారు. "మీకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నచ్చినా నచ్చకపోయినా.. ఆయనను చూడడం ఇష్టమున్నా, లేకపోయినా.. మీరు ప్రజాస్వామ్య దేవాలయాన్ని గౌరవించాల్సిందే" అని నిర్మల తేల్చిచెప్పారు. చెన్నైలో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రజల సమస్యలను చర్చించే వేదికగా నిలిచే పార్లమెంట్ ను బహిష్కరించడం మంచిది కాదని, మే 28న ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని విపక్షాలను కోరారు." నేను వినమ్రంగా అభ్యర్థిస్తున్నాను. విజ్ఞప్తి చేస్తున్నాను.. దయచేసి పునరాలోచించండి.. మీ మనస్సు మార్చుకోండి.. వేడుకల్లో పాల్గొనండి’’ అని పేర్కొన్నారు.

మోడీ కూడా పార్లమెంట్ లోపలికి నమస్కరించి అడుగు పెడతారని గుర్తు చేశారు. రాష్ట్రపతిని కేంద్ర ప్రభుత్వం అగౌరవ పరిచిందన్న విపక్షాల ఆరోపణ తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. తాము రాష్ట్రపతికి తగిన గౌరవం ఇస్తున్నామని నిర్మల స్పష్టం చేశారు. రాష్ట్రపతి ఎన్నిక సమయంలో గిరిజన నేపథ్యమున్న మహిళగా రాష్ట్రపతి గురించి ఎవరెవరు ఏం మాట్లాడారో తమకు ఇంకా గుర్తుందన్నారు. ఇప్పుడు అలాంటి వారంతా రాష్ట్రపతికి అవమానం జరుగుతోందని మాట్లాడటం తనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోందన్నారు. పార్లమెంట్ ప్రారంభోత్సవానికి తమిళనాడు నుంచి 20 మంది మఠాల అధిపతులను ఆహ్వానించినట్టు సీతారామన్ వెల్లడించారు.

తమిళ రాజ్యాలలో పాలనా చిహ్నం అయిన సెంగోల్ ను.. స్పీకర్ సీటు సమీపంలో ప్రధాని ప్రతిష్టిస్తారని తెలిపారు. "2021 సంవత్సరంలో సెంగోల్ రాజదండం గురించి ఓ పత్రిక కథనాన్ని ప్రచురించింది. దాన్ని ప్రముఖ నృత్యకారిణి పద్మా సుబ్రహ్మణ్యం తమిళం నుంచి ఆంగ్లంలోకి తర్జుమా చేసి, ప్రధానమంత్రి కార్యాలయానికి పంపారు. అది ఎక్కడ ఉందో తెలుసుకోవాలని ఆమె కోరారు. అది ప్రయాగరాజ్‌లోని ఆనంద భవన్‌ మ్యూజియంలో ఉందని కేంద్ర సర్కారు గుర్తించింది. ఇప్పుడు దాన్నే పార్లమెంట్ లో ప్రతిష్టించబోతున్నారు" అని ఆమె వివరించారు.


Next Story

Most Viewed