హర్యానాలో ఇంటర్నెట్ సేవల పునరుద్దరణ: శంభూ సరిహద్దులోనే రైతులు

by Dishanational2 |
హర్యానాలో ఇంటర్నెట్ సేవల పునరుద్దరణ: శంభూ సరిహద్దులోనే రైతులు
X

దిశ, నేషనల్ బ్యూరో: రైతు సంఘాల ‘ఢిల్లీ చలో’ మార్చ్ ఆందోళనలన నేపథ్యంలో హర్యానాలోని ఏడు జిల్లాల్లో ఈ నెల11న నిలిపివేయబడిన మొబైల్ ఇంటర్నెట్ సేవలను ఆదివారం పునరుద్దరించారు. అంబాలా, కురుక్షేత్ర, కైతాల్, జింద్, హిసార్, ఫతేహాబాద్ సిర్సా జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు. ఈ నెల 24వరకు ఈ సేవలపై ఆంక్షలు ఉండగా వాటిని ఎత్తేశారు. అంతేగాక ఢిల్లీలోని టిక్రి బోర్డర్, సింగు బార్డర్‌లను ఓపెన్ చేశారు. టీక్రి సరిహద్దుల్లోని రాళ్లను, కంటైనర్లను సైతం తీసేశారు. దీంతో ఢిల్లీ వెళ్లే ప్రజలకు కాస్త ఊరట లభించినట్టు అయింది. కాగా, ప్రభుత్వానికి, రైతులకు మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభన మధ్య రైతులు ఫిబ్రవరి 29 వరకు ఢిల్లీ మార్చ్‌ను నిలిపివేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అధికారులు ఇంటర్నెట్‌ సేవలను పునరుద్దరించారు. మరోవైపు రైతులు మాత్రం హర్యానా, పంజాబ్ బార్డర్ శంభూ సరిహద్దులోనే వేచి ఉన్నారు. చర్చలు జరిపి తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కాగా, సంయుక్త కిసాన్ మోర్చా (నాన్ పొలిటికల్), కిసాన్ మజ్దూర్ మోర్చా నేతృత్వంలో చేపట్టిన ఢిల్లీ మార్చ్‌లో పంటలకు కనీస మద్దతు ధరకి చట్టపరమైన హామీతో సహా పలు డిమాండ్లను రైతులు లేవనెత్తారు.



Next Story

Most Viewed