విద్వేషాన్ని నింపుతున్న వారిని తిరస్కరించండి..సోనియా గాంధీ కీలక సందేశం

by Dishanational2 |
విద్వేషాన్ని నింపుతున్న వారిని తిరస్కరించండి..సోనియా గాంధీ కీలక సందేశం
X

దిశ, నేషనల్ బ్యూరో: రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఇండియా కూటమి, కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ తెలిపారు. అబద్దాలు ప్రచారం చేస్తూ, దేశ ప్రజల్లో విద్వేషాన్ని నింపుతున్న వారిని తిరస్కరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు మంగళవారం ఎక్స్ వేదికగా ఓ వీడియో సందేశాన్ని రిలీజ్ చేశారు. ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు. ‘మోడీ పాలనలో నిరుద్యోగం పెరిగి పోయింది. మహిళలు, దళితులు, ఆదివాసీలు, మైనారిటీలపై వివక్ష అపూర్వ స్థాయికి చేరుకుంది. ఈ సవాళ్లు బీజేపీ, మోడీ హయాంలోనే ఉత్పన్నమయ్యాయి. అధికారాన్ని లక్ష్యంగా చేసుకుని ద్వేషాన్ని పెంచుతున్నారు. వారిని ఈ ఎన్నికల్లో తిరస్కరించండి’ అని తెలిపారు.

‘దేశంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం ధ్వంసమవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ రెండింటినీ పరిరక్షించేందుకు కాంగ్రెస్, ఇండియా కూటమి కట్టుబడి ఉన్నాయి. కాబట్టి అందరికీ ఉజ్వలమైన సమానమైన భవిష్యత్ కోసం కాంగ్రెస్‌కు ఓటు వేయండి. అందరం కలిసి శాంతి, సామరస్యంతో కూడిన ఐక్యమైన భారత దేశాన్ని నిర్మించుకుదాం’ అని చెప్పారు. దేశాన్ని ఏకం చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను రూపొందించామని స్పష్టం చేశారు.

Next Story

Most Viewed