Karnataka: నిర్లక్ష్యపు డ్రైవింగ్.. రూ.1.41 కోట్లు జరిమానా

by Yella Dhawani Reddy |

మోటారు వెహికిల్‌ యాక్ట్‌ (Motor Vehicles Act) ప్రకారం మైనర్లకు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వరు.

Karnataka: నిర్లక్ష్యపు డ్రైవింగ్.. రూ.1.41 కోట్లు జరిమానా
X

దిశ, వెబ్ డెస్క్: మోటారు వెహికిల్‌ యాక్ట్‌ (Motor Vehicles Act) ప్రకారం మైనర్లకు డ్రైవింగ్ లైసెన్స్ (Driving license) ఇవ్వరు. అంతేకాదు, వారికి వాహనాలను నడిపేందుకు ఇవ్వకూడదని తల్లిదండ్రులు, కుటుంబీకులు సహా అందరికీ తెలుసు. కానీ, ఎవరూ వినిపించుకోరు. నిత్యం రోడ్లపై అనేక మంది మైనర్లు వాహనాలు నడపటం చూస్తుంటాం. ఫలితంగా వారు ప్రమాదాల బారిన పడటంతో పాటు అమాయకుల ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. తాజాగా కర్ణాటకలో (Karnataka) ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. 17 ఏళ్ల బాలుడు ఆటో నడుపుతూ రోడ్డుపక్కన వెళ్తున్న వారిని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందటంతో కోర్టు వాహన యజమానికి రూ.1.41 కోట్ల జరిమానా విధించింది. పూర్తి వివరాల్లోకి వెళ్లితే..

కర్ణాటక రాష్ట్రంలోని కొప్పళ జిల్లా యలబుర్గలో 2021లో 17 ఏళ్ల బాలుడు ఆటో నడుపుతూ రోడ్డు పక్కన వెళ్తున్న వారిని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో గంగావతిలోని జయనగరకు చెందిన ఉద్యోగి రాజశేఖర్‌ అయ్యనగౌడ(48), మరికొందరు గాయపడ్డారు. తీవ్రంగా గాయపడ్డ రాజశేఖర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఘటనపై మృతుడి భార్య చెనమ్మ గంగావతి తాలూకా న్యాయ సేవా సమితిలో ఫిర్యాదు చేశారు. కేసును విచారించిన కోర్టు తాజాగా తీర్పు ఇచ్చింది. ఆ సమయంలో బాలుడు ఉపయోగించిన ఆటో యజమానికి రూ.1,41,61,580 జరిమానా విధించింది. బాలుడని తెలిసీ ఆటో ఎలా ఇస్తారని వాహన యజమానిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ తీర్పు బాలల చేతికి వాహనాలు ఇచ్చేవారికి హెచ్చరికలాంటిదని తెలిపింది. ఇక జరిమానా మొత్తాన్ని రాజశేఖర్‌ కుటుంబంలోని ముగ్గురికి సమానంగా పంచాలని అధికారులకు సూచించింది.

Next Story