- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
NEET UG Results: నీట్ యూజీ ఫలితాలు విడుదల.. అమ్మాయిలదే పైచేయి
పంజాబ్కు చెందిన ఆర్యన్ గుప్తా, హర్యానాకు చెందిన పాన్షుల్ బన్సాల్ సంయుక్తంగా 720కి 715 మార్కులు సాధించి టాపర్లుగా నిలిచారు.

దిశ, నేషనల్ బ్యూరో: నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నీట్ యూజీ-2026 రీ-ఎగ్జామ్ ఫలితాలను గురువారం రాత్రి ప్రకటించింది. జూన్ 21న జరిగిన ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా, విదేశాల్లో కలిపి దాదాపు 20 లక్షల మంది హాజరుకాగా, 11.21 లక్షల మందికి పైగా ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ తదితర అండర్గ్రాడ్యుయేట్ వైద్య కోర్సుల్లో ప్రవేశానికి అర్హత సాధించారు. అర్హత సాధించిన వారిలో 58 శాతానికి పైగా విద్యార్థినులే ఉండటం విశేషం. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారిలో ఎక్కువ మంది 17–19 ఏళ్ల వయస్సు గల విద్యార్థులే అని ఎన్టీఏ తెలిపింది. పంజాబ్కు చెందిన ఆర్యన్ గుప్తా, హర్యానాకు చెందిన పాన్షుల్ బన్సాల్ సంయుక్తంగా 720కి 715 మార్కులు సాధించి టాపర్లుగా నిలిచారు. మొత్తం 19 మంది 700కు పైగా, 138 మంది 690కు పైగా, 1,492 మంది 650కు పైగా, 10,160 మంది 600కు పైగా, 90,780 మంది 500కు పైగా మార్కులు సాధించారు.
ఫలితాల విడుదలతో దేశవ్యాప్తంగా వైద్య ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఫలితాలు ఆలస్యం కాకుండా సకాలంలో కౌన్సెలింగ్ పూర్తి చేసేందుకు ఎన్టీఏ యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేసింది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో 15 శాతం ఆల్ ఇండియా కోటా సీట్లకు మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) కౌన్సెలింగ్ నిర్వహించగా, రాష్ట్ర కోటా సీట్లను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు భర్తీ చేస్తాయి. వర్గాల వారీగా చూస్తే, జనరల్ విభాగంలో 2.91 లక్షలు, ఓబీసీ-ఎన్సీఎల్లో 5.12 లక్షలు, ఎస్సీలో 1.59 లక్షలు, ఎస్టీలో 63,716, జెనరల్-ఈడబ్ల్యూఎస్లో 95,026 మంది అర్హత సాధించారు. ఫలితాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఈసారి సవరించిన విధానాన్ని అనుసరించినట్లు ఎన్టీఏ తెలిపింది. కౌన్సెలింగ్కు సంబంధించిన సమాచారం కోసం అధికారిక వెబ్సైట్లనే అనుసరించాలని, సీట్లు ఇప్పిస్తామని లేదా మార్కులు పెంచిస్తామని చెప్పే మోసగాళ్లను నమ్మవద్దని ఎన్టీఏ అభ్యర్థులను హెచ్చరించింది. కాగా, మే 3న జరగాల్సిన నీట్ యూజీ పరీక్ష పేపర్ లీక్ కారణంగా రద్దు కావడం, ఆ తర్వాత జూన్ 21న రీ-ఎగ్జామ్ నిర్వహించడం తెలిసిందే. సుమారు 20 లక్షల మంది భవితవ్యాన్ని తేల్చే ఈ పరీక్షకు సంబంధించిన కీ ప్రక్రియను ఎన్టీఏ చకచకా పూర్తి చేసింది. జూలై 13న విడుదల చేసిన ఓఎంఆర్ షీట్లపై బుధవారం వరకు అభ్యంతరాలను సేకరించిన అధికారులు.. గురువారం ఫైనల్ కీ విడుదల చేసిన కాసేపటికే ఫలితాలను కూడా వెల్లడించారు.






