రాజకీయ పార్టీలకు RBI ఊహించని షాక్.. ఎన్నికల వేళ చాలెంజింగ్ టాస్క్‌గా నోట్ల మార్పిడి!

by Disha Web Desk 19 |
రాజకీయ పార్టీలకు RBI ఊహించని షాక్.. ఎన్నికల వేళ చాలెంజింగ్ టాస్క్‌గా నోట్ల మార్పిడి!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రూ.2వేల నోట్లపై రిజర్వు బ్యాంకు తీసుకున్న నిర్ణయం పొలిటికల్ పార్టీలను ఊహించని షాక్‌లోకి నెట్టింది. ఐదారు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సమయంలో రాష్ట్రంలోని రాజకీయ పార్టీలను ఇబ్బందుల్లోకి నెట్టింది. ప్రచారం, ఓటర్లకు పంపిణీ చేయడానికి ఇప్పటికే పోగేసుకున్న రూ. 2వేల నోట్లను మార్చుకోవడం నేతలకు సవాలుగా మారింది.

లెక్కల్లోకి రాని ఈ డబ్బును ఇతర నోట్లలోకి మార్చుకోడానికి అధికార పార్టీకి పెద్దగా ఇబ్బందులు లేకపోయినా, విపక్ష పార్టీలకు మాత్రం చిక్కులు తప్పేలా లేవన్న చర్చ జరుగుతున్నది. రాష్ట్రంలోని వ్యాపారులు, బ్యాంకు సిబ్బందే ఇప్పుడు పార్టీల నేతలకు ప్రధాన మార్పిడి కేంద్రాలుగా ఉంటాయన్న టాక్ వినిపిస్తున్నది. ఎక్కడెక్కడో మూలుగుతున్న రూ. 2వేల నోట్లన్నీ ఇప్పుడు బ్యాంకుల్లోకి వివిధ రూపాల్లో చేరనున్నాయి.

పార్టీలకు మింగుడు పడని నిర్ణయం

కొంతకాలంగా రూ. 2 వేల నోట్లు సామాన్య జనం చేతుల్లో కనిపించడంలేదన్న చర్చ జరుగుతున్నది. ఇవన్నీ బ్లాక్ మనీ పోగేసుకున్న వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకుల దగ్గరే పోగుపడ్డాయని బహిరంగంగానే కామెంట్లు వినిపించాయి. రిజర్వుబ్యాంకు ఒక్కసారిగా వీటిని చెలామణి నుంచి ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించడంతో మూలుగుల్లో దాక్కున్న నోట్లన్నీ ఇప్పుడు రోడ్డెక్కనున్నాయి.

బినామీ లావాదేవీల పేరుతో బ్యాంకులకు చేరనున్నాయి. ఎన్నికల సమయానికి మళ్లీ వేరే నోట్లతో గ్రామాల్లోకి చేరిపోనున్నాయి. ఈ ప్రక్రియ కోసం రాజకీయ పార్టీలన్నీ ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. సామాన్యుల కంటే రాజకీయ నాయకులకు ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం మింగుడుపడడంలేదు. దాచిపెట్టిన నోట్ల కట్టలను బయటకు తీయడం అనివార్యంగా మారింది.

అధికార పార్టీ నుంచే ఎక్కువ కామెంట్లు

రాష్ట్రంలోని అధికార పార్టీ నేతలకు సంబంధించే ఎక్కువగా కామెంట్లు వినిపిస్తున్నాయి. వరుసగా పదేళ్ల పాటు అధికారంలో ఉండడంతో ఆ పార్టీకి చెందిన నేతలు భారీ స్థాయిలో అక్రమ ఆస్తుల్ని పోగేసుకున్నారని, కొంత దాచుకున్న నోట్ల కట్టల రూపంలో ఉంటే, మిగిలింది భూముల రూపంలో ఉన్నాయంటున్నారు.

ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆ నోట్లను బైటకు తీసి ఓటర్లకు పంచిపెట్టడం లేదా భూముల్ని అమ్మి సమకూర్చుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈ సమయంలో ఆర్బీఐ నిర్ణయం తీసుకోవడంతో అలా దాచుకున్న కట్టల్లోని రెండు వేల రూపాయల నోట్లను మార్చుకోవడం తప్పనిసరి యాక్టివిటీగా మారిందంటున్నారు. బ్యాంకు ఖాతాల్లోకి వచ్చి పడే రెండు వేల నోట్ల సంగతి తేలితే ఏ పార్టీ నేత దగ్గర ఎంత ఉన్నదీ స్పష్టమవుతుందని, అందుకే ఈ ఖాతాదారులు ఎవరికి బినామీలో తేలిపోతుందని ఓపెన్‌‌గానే కామెంట్లు వినిపిస్తున్నాయి.

సామాన్యులకు నో టెన్షన్

రెండు వేల నోట్లను ఉపసంహరిస్తూ ఆర్బీఐ తీసుకున్న నిర్ణయాన్ని సామాన్యులెవరూ తప్పు పట్టడంలేదు. ‘ఈ నోట్లు ఎలాగూ మా దగ్గర లేవు. అంత పెద్దమొత్తంలో దాచుకునేంత స్థోమత కూడా లేదు. కరోనా సమయంలో ఉన్న డబ్బులన్నీ హారతి కర్పూరంలా కరిగిపోయాయి. ఆస్తులనూ అమ్ముకోవాల్సి వచ్చింది. ఇప్పుడు రెండు వేల నోట్లను దాదాపుగా రద్దు చేస్తున్నట్లు వెలువడిన ప్రకటనతో మాకు వచ్చిన నష్టమేమీ లేదు.’ అంటూ క్యాబ్ డ్రైవర్ ఒకరు వ్యాఖ్యానించారు.

అప్పర్ మిడిల్ క్లాస్, సంపన్నులకు మాత్రమే ఇబ్బంది అని అన్నారు. ఆర్థికవేత్త ఒకరు స్పందిస్తూ.. పెద్ద నోట్లను రద్దు చేస్తూ 2016లో ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయం మొత్తం దేశంలో చెలామణిలో ఉన్న కరెన్సీలో దాదాపు 86% అని, కానీ ఇప్పుడు ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో రెండు వేల నోట్ల వాటా కేవలం 11% మాత్రమేనని వ్యాఖ్యానించారు.

అప్పటి పరిస్థితులు ఉండకపోవచ్చు..

అప్పట్లో బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూ కట్టిన పరిస్థితులు ఇప్పుడు ఉండకపోవచ్చని, కారణం చాలా స్వల్ప మొత్తంలోనే రెండు వేల నోట్లు చెలామణిలో ఉండడం అని గుర్తుచేశారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత కేంద్ర ప్రభుత్వం ముద్రించిన రెండు వేల రూపాయల నోట్లలో దాదాపు 70 శాతానికి పైగా ఇప్పటికే ఆర్బీఐ దగ్గరకు చేరుకున్నాయని, మరో 20% మేర జాతీయ బ్యాంకుల దగ్గర ఉన్నాయని, కేవలం 11 శాతం మాత్రమే సంపన్నులు, వ్యాపారుల చేతుల్లో, దుకాణాల్లో ఉన్నాయని, అందువల్ల ఆర్బీఐ తాజా నిర్ణయంతో సామాన్యులకు వచ్చే ఇబ్బంది పెద్దగా ఉండకపోవచ్చని ఆ ఆర్థికవేత్త వివరించారు. సెప్టెంబరు వరకూ ఎవరి అకౌంట్ల ద్వారా ఎంత మొత్తంలో రెండు వేల నోట్లు మారుతాయన్నదే ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. ఆర్బీఐ నిర్ణయం దొంగ డబ్బును పోగేసుకున్నవారికి దిగ్భ్రాంతి కలిగించింది.

ఇవి కూడా చదవండి:

RBI సంచలన నిర్ణయం.. ATM, బ్యాంక్‌ల వద్ద క్యూ కట్టిన జనం!

రూ.2 వేల నోట్లు మేము తీసుకోం.. నిమిషాల వ్యవధిలోనే హైదరాబాద్‌లో నిలిచిన ట్రాన్స్‌క్షన్స్..!


Next Story

Most Viewed