Rajnath Singh: ఆపరేషన్ సిందూర్ లో నౌకాదళ పాత్ర అద్భుతం

by Shamantha N |

కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం భారతదేశంలో స్వదేశీంగా నిర్మించిన తొలి యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను సందర్శించారు.

Rajnath Singh: ఆపరేషన్  సిందూర్ లో నౌకాదళ పాత్ర అద్భుతం
X

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం భారతదేశంలో స్వదేశీంగా నిర్మించిన తొలి యుద్ధ నౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్‌ను సందర్శించారు. అంతేకాకుండా, నావికాదళ సిబ్బందితో సంభాషించారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో నేవీ పాత్రను రాజ్‌నాథ్ సింగ్ ప్రశంసించారు. స‌మ‌గ్ర‌మైన రీతిలో సాగిన ఆప‌రేష‌న్‌లో భార‌తీయ నౌకాద‌ళ పాత్ర కూడా అద్భుత‌మైంద‌ని మంత్రి రాజ్‌నాథ్ పేర్కొన్నారు. పాకిస్థానీ నేల‌పై ఉన్న ఉగ్ర స్థావ‌రాల‌ను ఐఏఎఫ్ ధ్వంసం చేస్తే, ఆరేబియా స‌ముద్రంలో ఉన్న భార‌త యుద్ధ నౌక‌లు.. పాకిస్థానీ నేవీని తీరానికి ప‌రిమితం చేశాయ‌న్నారు. చాలా తక్కువ సమయంలోనే పాక్ ఉగ్రస్థావరాలను ధ్వంసం చేశామన్నారు.

ప్రపంచ దేశాలను వేడుకుంది..

మ‌న దేశం పాక్ పై శక్తిమంతమైన దాడులు చేసిందని రాజ్ నాథ్ అన్నారు. ఆ దాడుల్ని విర‌మించుకునేలా చేయాల‌ని పాకిస్థాన్ ప్ర‌పంచ దేశాల‌ను వేడుకున్న‌ద‌ని తెలిపారు. మ‌న సైనిక ద‌ళాలు ఎంతో వేగంగా, స్ప‌ష్ట‌మైన దాడులు చేశాయ‌ని, అసాధార‌ణ రీతిలో ఆ దాడులు జ‌రిగిన‌ట్లు చెప్పారు. ఆప‌రేష‌న్ సింధూర్‌తో ఉగ్ర‌వాదుల‌కే కాదు, వాళ్ల‌ను పెంచి పోషించే వాళ్ల‌కు కూడా స్ప‌ష్ట‌మైన సందేశం ఇచ్చిన‌ట్లు తెలిపారు. ఆప‌రేష‌న్ సిందూర్ అనేది కేవ‌లం సైనిక చ‌ర్య మాత్ర‌మే కాదని.. ఉగ్ర‌వాదంపై అది మూకుమ్మ‌డి దాడి అని రాజ్‌నాథ్ చెప్పారు. పాక్ ఉగ్ర‌వాదుల‌ను నాశ‌నం చేసేందుకు ఏ ప‌ద్ధ‌తినైనా అనుస‌రిస్తామ‌ని, పాక్ ఊహించ‌లేని ప‌ద్ధ‌తుల్లో ఆ చ‌ర్య‌లు ఉంటాయ‌న్నారు. స్వాతంత్ర్యం వ‌చ్చిన నాటి నుంచి పాకిస్థాన్ ఆడుతున్న ప్ర‌మాద‌క‌ర ఉగ్ర‌వాద ఆట ఇప్పుడు ముగిసింద‌న్నారు. ఆపరేషన్‌ సిందూర్‌ ఇంకా ముగియలేదని.. ఇచ్చింది విరామమేనని పేర్కొన్నారు. పాక్‌ మరో తప్పు చేస్తే ఈసారి కోలుకునే అవకాశమే లేకుండా గట్టిగా ప్రతిస్పందిస్తామని హెచ్చరించారు.

Next Story