విద్యార్థి ఫీడ్‌బ్యాక్‌కు కేంద్రం తక్షణ రెస్పాన్స్.. మంత్రి అశ్విని వైష్ణవ్ కృతజ్ఞతలు

by Malleboina Mahesh |

ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ సమస్యలపై విద్యార్థి ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌కు 24 గంటల్లోనే స్పందించి ఫాలో-అప్ మీటింగ్ జరిపిన రైల్వే బోర్డు అధికారుల చొరవను మంత్రి అశ్విని వైష్ణవ్ అభినందించారు.

విద్యార్థి ఫీడ్‌బ్యాక్‌కు కేంద్రం తక్షణ రెస్పాన్స్.. మంత్రి అశ్విని వైష్ణవ్ కృతజ్ఞతలు
X

దిశ, వెబ్ డెస్క్: భారతీయ రైల్వే ప్రయాణికులకు డిజిటల్ సేవలను మరింత సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఐఆర్‌సీటీసీ (IRCTC) వెబ్‌సైట్‌ను పూర్తిస్థాయిలో ఆధునీకరించాలని నిర్ణయించింది. జైపూర్‌లోని ఎంఎన్ఐటీ (MNIT) లో విద్యార్థులతో జరిగిన ఒక సమావేశంలో, టికెట్ బుకింగ్ సమయంలో ఎదురవుతున్న క్యాప్చా (CAPTCHA) వెరిఫికేషన్ ఇబ్బందులు, సైట్ ల్యాగ్స్ సమస్యలను ఒక విద్యార్థి నేరుగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై తక్షణమే స్పందించిన మంత్రి, ప్రయాణికుల యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను మెరుగుపరిచేలా కేవలం 30 రోజుల్లోగా ప్లాట్‌ఫామ్‌ను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని అక్కడికక్కడే అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగానే రాబోయే జూలై 15, 2026 నాటికి సరికొత్త ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు.

కేంద్ర ప్రభుత్వ బాధ్యతాయుత పాలనకు నిదర్శనంగా.. ఈ ఆదేశాలు వచ్చిన మరుసటి రోజే రైల్వే బోర్డు చైర్మన్ & సీఈఓతో కూడిన ఉన్నతాధికారుల బృందం సదరు విద్యార్థితో ప్రత్యేకంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. కొత్త వెబ్‌సైట్ డిజైన్‌కు సంబంధించిన ప్రొటోటైప్స్‌ను చూపిస్తూ, ఆ విద్యార్థి నుండి మరిన్ని సలహాలు, వివరణాత్మకమైన ఫీడ్‌బ్యాక్‌ను సేకరించింది. కేంద్ర రైల్వే శాఖ తీసుకున్న ఈ తక్షణ చొరవపై సంతోషం వ్యక్తం చేసిన ఆ విద్యార్థి, సమస్యను వేగంగా పరిష్కరించినందుకు, మరుసటి రోజే తన నుండి ఇన్‌పుట్స్ తీసుకున్నందుకు సోషల్ మీడియా వేదికగా మంత్రి అశ్విని వైష్ణవ్‌కు, రైల్వే బోర్డుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Next Story