హింసాత్మకంగా మారిన అభ్యర్థుల ఆందోళన.. కీలక ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

by Web Desk |
హింసాత్మకంగా మారిన అభ్యర్థుల ఆందోళన.. కీలక ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
X

న్యూఢిల్లీ: బీహార్‌లో రైల్వే పరీక్ష అభ్యర్థుల ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఎన్టీపీసీ, లెవల్ 1 పరీక్షలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. దీనితో పాటు సమస్యలపై చర్చించేందుకు కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆర్‌ఆర్‌బీ రైల్వే పరీక్షల్లో అవకతవకలు జరిగాయని అభ్యర్థులు నిరసనలు చేపట్టారు. నాన్ టెక్నికల్ కేటగిరీలో విడుదలైన ఫలితాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. పరీక్ష రాసిన అభ్యర్థులు ఆందోళనలకు దిగారు. రైల్వే ట్రాక్‌లపైకి చేరి రైళ్లపై రాళ్లు రువ్వారు. ఈ క్రమంలో ఓ ట్రైన్‌కు నిప్పంటించారు. బీహార్‌లో శాంతి భద్రతలు ఆందోళనకరంగా మారడంతో ఇంటెలెజెన్స్ వర్గాలు అధికారులను హెచ్చరించాయి. ఈ ఆందోళనలు ఇతర రాష్ట్రాలకు కూడా పాకే ప్రమాదం ఉందని సూచించాయి. అప్రమత్తమైన అధికారులు చర్యలకు దిగారు. ఈ నేపథ్యంలో కమిటీ ఆందోళనకారులలోని కొందరితో సమావేశమై సమస్యలపై చర్చించనున్నట్లు పేర్కొంది. దీంతో పాటు తమ సమస్యలను ఈమెయిల్ ద్వారా కమిటీ దృష్టికి తీసుకురావాలని కోరింది. వచ్చే 12వ తేది వరకు వారికి అవకాశమిచ్చింది. మార్చి 4న తదుపరి నిర్ణయం ప్రకటిస్తామని పేర్కొంది. మరోవైపు నిరసనల్లో పాల్గొన్న అభ్యర్థులను నియమాక ప్రక్రియకు అనుమతించబోమని కేంద్రం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.




Next Story